మోదీ ప్రసంగంలో ఎన్టీయార్ ప్రస్తావన

Modi
Modi

ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించారు. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీ శ్రేణులకు అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించారు. రెండో రోజున మోదీ స్పీచ్‌లో స్వర్గీయ ఎన్టీయార్‌ సేవలను ప్రస్తుతించడం మాత్రం హైలైట్. ప్రజాక్షేత్రంలో కింది స్థాయిలో ఎన్టీయార్ పోరాడి అధికారానికి వచ్చారని మోదీ గుర్తుచేశారు. నిత్యం ప్రజలతో మమేకమైన నాయకుడు ఎన్టీయార్ అని, రాజకీయంగా ఎదగాలనుకునే వారికి ఎన్టీయార్ స్పూర్తి ప్రదాత అవుతారని మోదీ గుర్తు చేశారు..

రెండు రాష్ట్రాల్లో పనికొస్తుందని…

తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో ముందస్తు రాకపోతే వచ్చే ఏడాది అసెంబ్లీ పోలింగ్ నిర్వహిస్తారు. రెండు చోట్ల బలపడి, నిలబడాలని బీజేపీ భావిస్తోంది. ఎన్టీయార్‌కు బీసీల పాలిటి దేవుడన్న పేరు కూడా ఉంది. తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి ముఖ్యంగా తెలంగాణలో సెటిలర్లుగా పేరు పొందిన సామాజిక వర్గాలు కాంగ్రెస్, టీడీపీ దెబ్బతిన్న తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్టీయార్ పేరు చెప్పడం ద్వారా వారిని తమ వైపుకు తిప్పుకోవచ్చని మోదీ విశ్వసిస్తున్నారు. పైగా తెలంగాణలోని బీసీ వర్గాలు కూడా కేసీయార్ తీరుపై సంతృప్తిగా లేరు, వారికి గాలం వేస్తూ, ఎన్టీయార్ తరహాలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పడమే మోదీ ధ్యేయంగా భావిస్తున్నారు.

ఏపీలో జగన్‌ను వ్యతిరేకించే సామాజిక వర్గాలు, తటస్థ ఓటర్లు టీడీపీ వైపుకు చూస్తున్నారు. అక్కడున్న ఎన్టీయార్ అభిమానులు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అలాంటి వారిని తమవైపుకు తిప్పుకోగలిగితే లబ్ధి పొందే అవకాశం ఉందని బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడిన పక్షంలో తాము నిర్ణయాత్మక శక్తిగా మారే వీలుంటుందని మోదీ ఆశ. అంతకు మించి ఏమీ లేదు….