ఏపీ స‌ర్కారు కిట్లకు కేంద్రం బ్రేక్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొరియా నుంచి తెప్పించిన ర్యాపిడ్ క‌రోనా టెస్టింగ్ మీద కొన్ని రోజులుగా ఎంత ర‌గ‌డ న‌డుస్తోందో తెలిసిందే. ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం ఒక్కోటి రూ.337 రూపాయ‌ల‌కే కొన్న కిట్ల‌ను ఏపీ స‌ర్కారు రూ.700 చొప్పున‌ పెట్టి కొన‌డంపై దుమారం రేగింది. దీనిపై ఏపీ ప్ర‌భుత్వం ముందు బుకాయించిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. చివ‌రికి రేటు త‌గ్గించే ప్ర‌భుత్వానికి అంద‌జేసేందుకు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన కంపెనీ అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. ఐతే ఈ వ్య‌వ‌హారం ఇంత‌టితో స‌ద్దుమ‌ణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్య‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ‌.. రెండు రోజుల పాటు వాటి వినియోగాన్ని ఆపేయాల‌ని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ప‌ది నుంచి 30 నిమిషాల లోపే ఫ‌లితాలు వెల్ల‌డిస్తాయ‌ని అంటున్నారు. ఐతే వీటి ఫ‌లితాల్లో క‌చ్చిత‌త్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. ఈ కిట్లు త‌యారైన కొరియాలోనే వీటి నాణ్య‌త మీద సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అక్క‌డి వైద్యులు ఈ కిట్ల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని సూచించారు. అయినా స‌రే.. ఏపీ స‌హా కొన్ని రాష్ట్రాలు ఆ కిట్ల‌ను తెప్పించుకున్నాయి. ఐతే ఈ కిట్ల ప‌నితీరును ప‌రిశీలిస్తే క‌చ్చిత‌మైన ఫ‌లితాలు రావ‌ట్లేద‌ని వెల్ల‌డైంద‌ని.. ఫలితాల్లో తేడా ఉంటోంద‌ని.. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల పాటు ఈ కిట్ల విని‌యోగం ఆపాల‌ని.. త‌దుప‌రి మార్గ‌ద‌ర్శ‌కాలు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌తినిధి మీడియా స‌మ‌వేశంలో తెలిపారు. మ‌రి ల‌క్ష ర్యాపిడ్ కిట్లు వ‌చ్చేశాయ్.. టెస్టింగ్స్ సంఖ్య ఒక్క‌సారిగే పెంచేద్దాం అనుకున్న ఏపీ స‌ర్కారుకు ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే.