రాజు గారి నుంచి జగన్ కు మరో లేఖ వచ్చింది

151 ఎమ్మెల్యేలు… చరిత్రలో ఇంత శాతం ఎమ్మెల్యేలు ఒక పార్టీకి రావడం చాలా చాలా అరుదు. అందుకే విశ్లేషకులు అందరూ… ఇక జగన్ పార్టీలో అసమ్మతికి చెల్లుచీటీ అని గెలిచిన తొలినాళ్లలో వ్యాఖ్యానించారు. కానీ… ఒక అసమ్మతి వైసీపీని ఒక ఊపు ఊపుతుందని విశ్లేషకుల అంచనాకు అందలేదు. ఆ ఒక్కడు రాజుగారు. రఘురామరాజు ఎపిసోడ్ మొదటి అంకంలో పార్టీలో జగన్ ను కీర్తిస్తూ నిర్ణయాలపై సద్విమర్శలు చేస్తూ వచ్చాడు. ఇపుడు రెండో అంకంలో జగన్ కు పొగడ్తలు తగ్గాయి. మోడీపై పొగడ్తలు పెరిగాయి. దాంతో పాటు లేఖలు మొదలయ్యాయి. వాటిలో విమర్శలు, తిట్లు లేకపోవచ్చు గాని ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన డిమాండ్లన్నీ రఘురామ రాజు లేఖల్లో వస్తున్నాయి.

ఒక పార్టీ వర్సెస్ ఒక ఎంపీ వార్ జరగడం, అది కూడా ఇంతకాలం కొనసాగడం ఒక వింత. పార్టీ మాట వినకుండా తనకు నచ్చినట్లు చేసుకుంటూ పోయి… వీటిని తీర్చండి అంటూ ప్రభుత్వానికి వినతుల చిట్టా ఇవ్వడం అంటే ఆ ఎంపీ నేపథ్యము, మద్దతు ఏంటో అందరికీ స్పష్టమైపోయింది. కొట్టాలనిపించేంత కోపం ఉన్నా… పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అతనికి స్వేచ్ఛ ఇచ్చినట్టు అవుతుందని వైసీపీ తనదైన వ్యూహంతో డిస్ క్వాలిఫికేషన్ పత్రం లోక్ సభ స్పీకరుకు ఇచ్చి తాను మాత్రం సస్పెన్షన్ వేటు వేయడం లేదు.

దీంతో స్వపక్షంలోనే విపక్షంలా అధినాయకత్వానికి మరింత కోపం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు రఘురామరాజు… దానికి లేఖలు అనే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే మూడు నాలుగు లేఖలు జగన్ కి నచ్చని సబ్జెక్టులపై రాసిన రాజు గారు ఇపుడు మరో లేఖ సంధించారు.

రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకొస్తూ లేఖ రాశారు. కొన్ని నెలలుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోమని లేఖలో కోరారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నగదు, ఉచిత రేషన్ అందిస్తున్నాయి. అది చాలదు. మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చాలామంది సాయం కోరుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నుంచి తనకు వినతులు వస్తున్నట్టు చెప్పడం విశేషం.

మన ప్రభుత్వం 20,64,379 మంది కార్మికుల పేర్లను ఆధార్ తో లింకు చేయాలని సంకల్పించింది. అయితే ఇప్పటివరకు 10,66,265 మంది మాత్రమే లింకయ్యారు. మిగతా కార్మికుల పేర్లను కూడా ఆధార్ తో అనుసంధానం చేసేలా గ్రామ, వార్డు వలంటీర్లకు ఆదేశించండి. 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్ల నుంచి లేబర్ వెల్ఫేర్ ఫండ్ రూపంలో రూ.1364 కోట్లు వసూలు చేసినా, ఇప్పటివరకు రూ.330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా నిధులు ఇపుడు బయటకు తీసి ఆదుకోమని రఘురామకృష్ణరాజు కోరారు. ఇది ఒకరకంగా… అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆదుకోవడం లేదని చెప్పడానికి చేసిన ప్రయత్నంలా ఉంది. ఈ లేఖాస్త్రాలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయో మరి?