గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోని కాంగ్రెస్

ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్….130 ఏళ్ల ఘ‌న‌చ‌రిత్ర క‌లిగిన పార్టీ……దేశానికి ఎంద‌రో కీల‌క‌మైన నేత‌ల‌ను అందించిన పార్టీ…. స్వ‌తంత్రానికి పూర్వం స్థాపించిన ఈ పార్టీ గ‌తమెంతో ఘ‌నం. కానీ, ప్రస్తుతం ఈ పార్టీ పరిస్థితి రాజకీయ సంద్రంలో చుక్కాని లేని నావ‌లా త‌యారైంది. గతమెంతో వైభవంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని న‌డిపించే బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేక పార్టీ ప‌రిస్థితి నానాటికీ దిగజారుతోంది. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వంలో దేశాన్ని పాలించిన ఈ పార్టీ…ఇపుడు తనను ముందుకు నడిపించే నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. తాను అధ్యక్షుడిగా ఉండనంటూ రాహుల్ గాంధీ పార్టీ బాధ్య‌త‌లకు దూరంగా ఉంటున్నారు.

వ‌యోభారం, అనారోగ్యం వంటి కారణాలతో మ‌రోసారి పూర్తి స్థాయిలో అధ్య‌క్ష బాధ్యతలు చేపట్టేందుకు సోనియా గాంధీ విముఖంగా ఉన్నారు. రాహుల్‌ను కాద‌ని ప్రియాంకా గాంధీని యువరాణిగా ప్రకటించలేని పరిస్థితి. మరోవైపు, ప్రధాని మోడీ నాయకత్వంలో బలమైన బీజేపీ….నానాటికీ మరింత బలపడుతోంది. ఇటువంటి పరిణామాలు కాంగ్రెస్ లీడ‌ర్స్‌, కేడ‌ర్‌ను క‌ల‌వ‌రపెడుతున్నాయి. కాంగ్రెస్ లో నాయకత్వ లేమిని…సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయ లోపాలను బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషి చేసిన రాహుల్ గాంధీ నమ్మిన బంటు జ్యోతిరాదిత్య సింధియా…బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతోనే సీనియర్, జూనియర్ల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి.

అదే తరహాలో తాజాగా రాజస్థాన్ లోనూ సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కు, సచిన్ పైలట్ కు ఉన్న విభేదాలు ఈ వ్యవహారంతో బట్టబయలయ్యాయి. సచిన్ పైలట్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగినా…దానిని ఆయన కొట్టిపడేశారు. మరోవైపు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారెవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ గెహ్లాట్ అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ సచిన్ కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు అంటున్నారు. మరోవైపు, సచిన్ పైలట్ ను బుజ్జగించేందుకు రాహుల్, ప్రియాంకా గాంధీలు రంగంలోకి దిగారు.

అయితే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కీలకమైన నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాతే మా పార్టీ మేలుకుంటుందేమో… అని పరోక్షంగా సొంతపార్టీపైనే కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలు మరోసారి బయటపడినట్లయింది. నాయకత్వ లేమి, అనాలోచిత నిర్ణయాలు…ఇలా కారణాలేమైనా…కాంగ్రస్ ఆశగా చూస్తోన్న ఆశాకిరణాలు ఒక్కొక్కటిగా సొంతగూటికి వెలుగునివ్వకుండానే వేరే గూటిలో వెలిగిపోతున్నాయి. వీలైనంత త్వరగా నాయకత్వ సమస్యను పరిష్కరించ‌కుంటే పార్టీకి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శశిథరూర్ కూడా గతంలో ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్‌కు ఇష్టం లేకుంటే వేరెవ‌రినైనా అధ్య‌క్షుడిగా త‌క్ష‌ణ‌మే నియ‌మించ‌కుంటే పార్టీ మనుగడే ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని శశిధరూర్ చేసిన హెచ్చ‌రికల ఫలితం ఇపుడు సచిన్ పైలట్ తిరుగుబాటు రూపంలో కనిపిస్తోంది.

నేటి ఏపీ సీఎం జగన్ మొదలుకొని సచిన్ పైలట్ వరకు ఎంతోమంది కాంగ్రెస్ రెబల్స్ గా ముద్రపడి….ఇపుడు బలమైన నేతలుగా ఎదిగారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైెఎస్ జగన్….సొంతగా పార్టీ పెట్టి….తొలి ప్రయత్నంలోనే సీఎం కుర్చీ అంచులవరకు వెళ్లారు. మలి ప్రయత్నంలో అఖండ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీ మారడానికి రెండు నెలల ముందే హింట్ ఇచ్చారు. అయినా, బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఇప్పటికే తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకొన్న సింధియా…బీజేపీలో కీలక నేతగా ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక, సచిన్ పైలట్ కూడా రాహుల్ సన్నిహితుల్లో ఒకరు. రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుపు కోసం సచిన్ ఎంతో చేశారు. అయితే, సీనియర్ అయిన అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యారు. వీరిద్దరి మధ్య విభేదాలు తాజాగా తారస్థాయికి చేరాయి. దీంతో, సచిన్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. జ్యోతిరాదిత్య సింధియా తరహాలో మరింత మంది బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశముంది. సచిన్ పైలట్ తరహాలో మరింత మంది బలమైన నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేసే అవకాశముంది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా మేల్కోకుంటే…కాంగ్రెస్ లోని ఆశా కిరణాలు మరో పార్టీలో విరాజిల్లుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.