మంత్రులకు చుక్కలు చూపిస్తున్నమునుగోడు పోల్ ఫలితాలు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలుగా పేరును సొంతం చేసుకున్న ఈ ఎన్నికల్లో విజయం తమకు తధ్యమని టీఆర్ఎస్ నేతలు ధీమాగా చెప్పటం తెలిసందే. చెప్పిన మాటలకు.. ఈవీఎంలు ఓపెన్ అయ్యాక వస్తున్న ఫలితాలకు పొంతనే లేని పరిస్థితి. నాలుగైదు రౌండ్లు పోయేసరికి.. విజయగర్వంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడుతున్నాయి.

ఐదో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అధిక్యతలోకి వచ్చింది. నాలుగో రౌండ్ నాటికి స్వల్ప అధిక్యతలో ఉన్న టీఆర్ఎస్.. ఐదో రౌండ్ ముగిసే సమయానికి 1631 ఓట్లు అధిక్యతలో ఉంది. మొదటి నాలుగు రౌండ్లతో పోలిస్తే.. ఐదో రౌండ్ లోనే టీఆర్ఎస్ కు కాస్తంత అధిక్యత ఎక్కువగా వచ్చినట్లు చెప్పాలి. ఐదోరౌండ్ లో917 ఓట్ల అధిక్యత రావటంతో.. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టిన తర్వాత ఐదో రౌండ్ కు కానీ నాలుగు అంకెల మెజార్టీ వచ్చిన మొదటి సందర్భంగా ఇదేనని చెప్పాలి.

ఈ ఉప పోరు కోసం 16 మంది మంత్రులను.. 84 మంది ఎమ్మెల్యేలను బరిలోకి దించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నికను తానెంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నానన్న విషయాన్ని తన చేతలతోనూ.. నిర్ణయాలతో తీసుకున్నారని చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఆయన తన సర్వశక్తుల్ని ఒడ్డారని చెప్పాలి. అయినప్పటికీ పోరు హోరాహోరీ అన్నట్లు సాగుతున్న తీరు చూస్తే.. సీన్ లోకి ముఖ్యమంత్రి లేకుంటే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున బాధ్యతను అప్పగించగా.. వారు నిర్విరామంగా శ్రమించటం తెలిసిందే.

అయినప్పటికీ.. ఇప్పటివరకు వెలువడిన (ఐదో రౌండ్ ముగిసేనాటికి) ఫలితాల్ని చూస్తే.. పలు చోట్లు మంత్రులకు ఎదురుదెబ్బలు తప్పని పరిస్థితి. అన్నింటికి మించి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంతూరు లింగావారి గూడెంలో బీజేపీ అధిక్యంలో నిలవటం గులాబీ వర్గాలకు ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ.. ఈ ఎన్నికల్లో గెలిచినా.. సొంతూరులో కూసుకుంట్లకు అధిక్యత రాకపోవటాన్ని ఎలా సర్ది చెప్పుకోవాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇక.. పలువురు మంత్రులకు మునుగోడు పీడకలగా మారుతుందని చెబుతున్నారు. ఉదాహరణకు మంత్రి మల్లారెడ్డి విషయాన్నే తీసుకుంటే.. ఆయన్ను ఇంఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పిన ప్రాంతంలో ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదని చెప్పాలి. ప్రతి ఇంటిని ఒకటికి రెండుసార్లు తిరిగి.. వారి అవసరాల్ని గుర్తించి.. వారికి అవసరమైన వాటిని తక్షణమే ఏర్పాటు చేసి.. వారిని మత్తులో ముంచెత్తినప్పటికీ ఫలితం దక్కలేదంటున్నారు. ఆయన బాధ్యత తీసుకున్న ప్రాంతంలో బీజేపీ లీడ్ లోకి రావటం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

ఇదే రీతిలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న దేవులమ్మ నాగారంలోనూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధ్యత తీసుకున్న లింగోజీగూడెంలోనూ బీజేపీ అధిక్యతలో నిలవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తుది ఫలితం సంగతి దేవుడెరుగు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద తమ పరిస్థితి ఏమిటి? అన్నది ఆసక్తికర చర్చగా మారింది. చూస్తుంటే.. టీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రముఖులకు మునుగోడు మర్చిపోలేని ఒక భయంకర అనుభవంగా మిగిలే వీలుందన్న మాట వినిపిస్తోంది.