కాంగ్రెస్ కు మరో షాకివ్వనున్న కేసీఆర్?

నా స్టోరీ చెప్పాలంటే తెలంగాణకు ముందు తెలంగాణకు తర్వాత…అని ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర చెప్పాలన్నా… ప్రత్యేక తెలంగాణా ఇవ్వక ముందు…ఇచ్చిన తర్వాత అని చాలాకాలంగా సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్….కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు వస్తోన్న ప్రతి అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకుంటున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని చాలామందిని టీఆర్ ఎస్ వైపునకు తిప్పుకొని కాంగ్రెస్ ను బలహీనం చేశారు. కాంగ్రెస్ కు చిరాకు తెప్పించే పనులన్నీ చేస్తోన్న కేసీఆర్ ….ఇటీవల పీవీ జయంతి ఉత్సవాలను జరిపి పీవీ, కాంగ్రెస్ అభిమానుల మెప్పు పొందారు.

ఇక తాజాగా కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు కేసీఆర్ తన అమ్ములపొదిలో మరో అస్త్రాన్ని సిద్ధం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా పీవీ కూతురును గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారన్న టాక్ కాంగ్రెస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందట.

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ కూతురు వాణితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ పదవి గురించి వాణి, కేసీఆర్ ల మధ్య చర్చ జరిగిందిని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గవర్నర్ కోటాలో వాణికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు ఫిక్స్ అయ్యారని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఆషాఢం తర్వాత ఈ వ్యవహారం చక్కబెట్టేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వస్తోంది. తెలంగాణ శాసనమండలిలో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే 2 స్థానాలు గవర్నర్ కోటాలో ఖాళీ కాగా, త్వరలోనే మరోటి కాబోతోంది. ఆ మూడింటిలో ఒకటి నాయని నరసింహారెడ్డికి ఫిక్స్ అయిందట.

వచ్చే నెలలో పదవీకాలం పూర్తి కావచ్చిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కే మరోసారి అవకాశం ఇవ్వబోతున్నారట. రాములు నాయక్ పై అనర్హత వేటు పడటంతో ఆ స్థానంలో వాణికి చాన్స్ ఇచ్చేందుకు సార్ సిద్ధమవుతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఒకవేళ, ఊహాగానాలు నిజమై వాణికి ఎమ్మెల్సీ పదవి దక్కితే…కాంగ్రెస్ ను మరోసారి కేసీఆర్ ఇరకాటంలో పడేసినట్లే.