బ్రేకింగ్.. సచివాలయం కూల్చివేతకు బ్రేక్

కరోనా విజృంభిస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సెక్రటేరియట్ భవనాల కూల్చివేత పనుల్లో నిమగ్నం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికప్పుడు అత్యవసరంగా ఈ పని చేపట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తాయి.

ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆక్షేపించాయి. ఐతే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా సీరియస్‌గా సెక్రటేరియట్ కూల్చివేత పనులు చేపడుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఐతే శుక్రవారం హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి షాకిస్తూ సెక్రటేరియట్ కూల్చివేత పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

సెక్రటేరియట్ కూల్చివేత ఆపేయాలని పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ పిటిషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రస్తుతం ఉన్న సచివాలయ ప్రాంతంలో కొత్త నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా నిర్మించాలని భావించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చిన ఉన్నత న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

కొత్త సచివాలయ భవనం నిర్మాణం కోసం ప్రస్తుత భవనాల్ని కూల్చివేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ దీంతో ప్రభుత్వం కూల్చివేత ప్రారంభించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పనులు నిలిచిపోనున్నాయి.