టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ భారీ షాక్‌..

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కేంద్రం కూడా అలెర్ట‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో త‌న‌దైన శైలిలో కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా.. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామా కు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది.

ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్ళించినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మధుకాన్‌ గ్రూప్‌ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్‌, ఖమ్మం, ఏపీలోని ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరిట నామా నాగేశ్వరరావు రుణాలు తీసుకొని దారి మళ్లించారని ఈడీ ఆరోపించింది. సుమారు రూ.361.92 కోట్లు నేరుగా మళ్లించినట్లు గుర్తించామని ఈడీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో 6 డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో గతంలో నామాకు చెందిన రూ.73.43 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం స్ప‌ష్ట‌మేన‌ని పేర్కొంది.

అయితే.. సీఎం కేసీఆర్ డిల్లీలోనే ఉండ‌డం.. ఆయ‌న జాతీయ పార్టీ పెట్టి.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ తాజా ప‌రిణామం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై ఎంపీ నామా ఇంకా స్పందించ‌లేదు. ఆయ‌న ఏం చెబుతారో న‌ని.. అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఇక‌, టీఆర్ ఎస్ వ‌ర్గాలు కూడా మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.