భారత్‌లో కరోనా.. భయపెడుతున్న ఎంఐటీ ఫిగర్స్

రెండు నెలల కిందట ఇండియాలో రోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్నపుడే వామ్మో వామ్మో అంటూ మాట్లాడుకున్నాం. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారంటే అయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు 20 వేల మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో చనిపోతున్నారు.

ఐతే ఇదే పీక్స్ అనుకుని.. త్వరలో మంచి రోజులు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం లేదు. మున్ముందు ఇంకా దారుణమైన పరిస్థితులు చూస్తామనే సంకేతాలే అన్ని అధ్యయనాలూ ఇస్తున్నాయి. తాజాగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) భారత్‌లో మున్ముందు కరోనా తీవ్రత ఎలా ఉండబోతోందో నిపుణులతో ఒక అధ్యయనం జరిపి దాని వివరాలు వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్ కానీ, వైరస్‌ను తగ్గించే కచ్చితమైన మందులు కానీ రాకపోతే 2021లో చలికాలం ముగిసేసరికి రోజుకు 2.87 లక్షల మంది చొప్పున కరోనా బారిన పడతారని ఎంఐటీ అధ్యయనం అంచనా వేసింది. రోజు వారీ కేసుల్లో అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా అగ్రస్థానానికి చేరుతుందని కూడా ఆ సంస్థ ప్రకటించింది. ,ఇండియాలో కేసులు, మరణాల వివరాలు ప్రస్తుతం సరిగా అందడం లేదని.. జూన్ 18 నాటి సమాచారం ప్రకారం వాస్తవ కేసులు ప్రకటిస్తున్న దాని కంటే 11.8 రెట్లు, మరణాలు 1.48 రెట్లు ఉండేందుకు ఆస్కారం ఉందని ఆ సంస్థ వెల్లడించింది.

హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే విషయంలో ప్రస్తుతం ఏ దేశం దగ్గరగా లేదని… దాని కోసం ఎదురు చూడటం మంచిది కాదని ఎంఐటీ స్పష్టం చేసింది. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వృద్ధి రేటు ఉన్న దేశంగా ఇండియా నిలుస్తుండటం ప్రమాదకర సంకేతం. గత వారం రోజుల్లో రోజుకు సగటున 3.5 శాతం మేర కరోనా కేసుల వృద్ధి కనిపించింది ఇండియాలో. ఈ విషయంలో బ్రెజిల్ 2.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. అమెరికా 1.8 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.