వైకాపాలో స్టార్ ఎమ్మెల్యే వెర్స‌స్ సీనియ‌ర్ నేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాదైందో లేదో.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. తాజాగా చిల‌క‌లూరి పేట‌లో అధికార పార్టీ కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో రాజ‌కీయం రాజుకుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ర‌జ‌నీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమె వైకాపా స్టార్ ఎమ్మెల్యేల్లో ఒక‌రు. ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు ర‌జ‌నీ.

ఇక అక్క‌డ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట వైసీపీలో సీనియర్ లీడర్. 2004లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడాయ‌న‌. ఎన్నికల ముందు టికెట్‌ కోసం వీరి మధ్య యుద్దం జరిగింది, అందులో ర‌జ‌నీనే గెలిచారు. ఐతే ఇప్పుడు మరోసారి వారి మ‌ధ్య‌ కయ్యం మొదలైంది. ఎన్నిక‌ల త‌ర్వాత ర‌జ‌నీ త‌న‌దైన ప‌బ్లిసిటీ హ‌డావుడితో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె పాపులారిటీ అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఐతే ఎమ్మెల్యేగా లేకపోయినా రాజ‌శేఖ‌ర్‌కు ఫాలోయింగ్ ఏమీ త‌క్కువ కాదు. ఇప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి ఏ సమాచారమైనా మొదట రాజశేఖర్‌కే అందుతుందట. నియోజ‌క‌వ‌ర్గంలో సీనియర్లతో ఆయ‌న‌ నిత్యం టచ్‌లో వుంటారట. నేతలు ఎవరైనా ముందుగా మర్రిని కలుసుకున్న తర్వాతే, రజనీని కలుస్తారట. ఇది ర‌జ‌నీకి న‌చ్చ‌ట్లేద‌ని స‌మాచారం. మర్రి వర్గీయులన్న ముద్ర ఉన్నవారిని తన కార్యాలయంలోకి రావద్దని కూడా రజనీ నిర్మొహమాటంగా చెప్పేశారట. దీంతో మర్రి వర్గీయులు వేరు కుంపటి పెట్టుకున్నారు. వివిధ సంద‌ర్భాల్లో పార్టీ త‌ర‌ఫున పెట్టిన ఫ్లెక్సీల్లో ర‌జ‌నీకి వాళ్లు చోటివ్వ‌ట్లేదు. ఈ ఫ్లెక్సీల‌ను మున్సిప‌ల్ అధికారులు తొల‌గించ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

రజనీ ఒత్తిడి మేరకు తొలగిస్తున్నారంటూ మర్రి వర్గీయులు ఏకంగా మున్సిపల్ ఆఫీస్ ముందు గ‌తంలో ఆందోళనకు దిగారు. పదవి లేకపోవటం వల్లనే, మర్రి రాజశేఖర్‌కు తగిన గౌరవం దక్కటం లేదన్నది ఆయనతో పాటుగా ఆయన వర్గీయుల ఆవేదన. ఈ నేప‌థ్యంలో మ‌ర్రికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌బోతోంద‌ని.. దీంతో ర‌జ‌నీకి చెక్ ప‌డిన‌ట్లే అని ఓ ప్ర‌చారం న‌డుస్తోంది. ఇది ర‌జ‌నీ వ‌ర్గానికి మింగుడు ప‌డ‌టం లేద‌ని అంటున్నారు. ఏదేమైనా చిల‌క‌లూరి పేట‌లో అంత‌ర్గ‌త పోరు వైకాపాకు త‌ల‌నొప్పిగా మారేలా ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.