అక్క‌డ‌ ఎంపీ అభ్య‌ర్థి ఎవ‌రు? రెండు పార్టీల్లోనూ క‌ల‌వ‌రం

వ‌చ్చే ఎన్నిక‌లు ఎంత హాట్ గా ఉంటాయో.. ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. గెలుపు కోసం.. అధికార వైసీపీ. టీడీపీలు ఢీ.. అంటే ఢీ.. అనే ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎక్క‌డ ఎలా ఉన్నా.. విజ‌య‌వాడ, గుంటూరు న‌గ‌రాలు అత్యంత కీల‌కం. ఈ రెండు చోట్లా త‌మ త‌మ పార్టీలు గెలుపు గుర్రం ఎక్కితే.. ఆ లెక్కే వేరు! అనే విధంగా పార్టీలు భావిస్తాయి. అయితే.. ఇప్పుడు ఈ రెండు ఎంపీ స్తానాల్లోనూ.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. కానీ, ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. ఆదిలో బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత ఈ రెండు చోట్లా విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీలు సైలెంట్ అయ్యారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీలు నాయ‌కుల‌ను ఛేంజ్ చేసే ప‌నిలో ఉన్నాయి. టీడీపీ విష‌యానికి వ‌స్తే.. కేశినేని నాని విజ‌యవాడ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా.. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఒరిగింది ఏమీ లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను మార్చాల‌నే డిమాండ్లు ఇప్ప‌టికే తార‌స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇక్కడ ఆయ‌న త‌మ్ముడు శ్రీనాథ్‌కు అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని లేక‌పోతే.. నేరుగా నంద‌మూరి కుటుంబం నుంచి ఎవ‌రైనా వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.

ఇక‌, వైసీపీ కూడా ఇక్క‌డ నుంచి మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ను రంగంలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. అయితే.. ల‌గ‌డ‌పాటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఆయ‌న పోటీ చేస్తానంటే.. వైసీపీ వెండి ప‌ళ్లెంలో పెట్టి సీటును ఇచ్చేందుకు రెడీగా ఉంది. మ‌రోవైపు య‌ల‌మంచిలి ర‌వి కూడా విజ‌య‌వాడ పార్ల‌మెంటు సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలోనే ఉన్నారు. సో.. ఆయ‌న‌కు ఇస్తే.. ప‌రిస్థితి ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, గుంటూరు విష‌యానికి వ‌స్తే.. గ‌ల్లా జ‌య‌దేవ్ పార్టీలో దూకుడు త‌గ్గించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా కంటే.. ఎమ్మెల్యేగానే ఆయ‌న పోటీకి రెడీ అవుతున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీకి ఇక్క‌డ నాయ‌కుడి అవ‌స‌రం ఉంది. రేపు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే.. ఈ సీటును జ‌న‌సేన‌కు ఇచ్చే యోచ‌న‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే.. జ‌న‌సేన త‌ర‌ఫున కూడా బ‌ల‌మైన నాయ‌కుడు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పార్టీ మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. సో.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే ఆలోచ‌న వైసీపీ చేయ‌డం లేదు. పైగా.. ఇక్క‌డ నుంచి సినీ రంగానికి చెందిన ఆలీకి అవ‌కాశం ఇవ్వొచ్చ‌ని.. చ‌ర్చ జ‌రుగుతోంది. ఆలీ అయితే.. సునాయాశంగా గెలుస్తార‌ని అంచ‌నాలు కూడా వ‌స్తున్నాయి. ఏదేమైనా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ, వైసీపీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి.