తెలంగాణ‌లో క‌రోనా.. తొలిసారి ఆ మార్కు

మొన్న 920.. నిన్న 985.. ఇక వెయ్యి మార్కును అందుకోవ‌డం లాంఛ‌మే అనుకుంటున్నారంతా. అదే జ‌రిగిందిప్పుడు. తెలంగాణ‌లో తొలిసారిగా క‌రోనా కేసులో వెయ్యి మార్కును దాటాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న క‌రోనా కేసులు.. కొత్త మైలురాయిని అందుకున్నాయి. శ‌నివారం రాత్రి తెలంగాణ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోయ్యాయి. ఒక్క రోజులో క‌రోనా వ‌ల్ల ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ తెలంగాణ‌లో 13,436 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. మొత్తం 243 మంది మృతి చెందారు.

శనివారం 162 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ మొత్తంగా 4,928 మంది క‌రోనా నుంచి కోలుకుని ఇళ్ల‌కు చేరారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,265. ఎప్ప‌ట్లాగే తాజాగా బ‌య‌ట‌ప‌డ్డ కేసుల్లో మెజారిటీ జీహెచ్‌యెంసీ ప‌రిధిలోనివే. శ‌నివారం మొత్తం 1087 కేసుల్లో.. దీని పరిధిలోనే 888 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5, నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో 3, సిద్దిపేటలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 2, ఆసీఫాబాద్, ఖమ్మం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. శ‌నివారం దేశ‌వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 18,500కు పైగా కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తం ఇండియా కేసులు 5 ల‌క్ష‌ల మార్కును దాటిన సంగ‌తి తెలిసిందే.