జగన్ అండ్ కోకు షాకిచ్చిన పార్క్ హయత్ ఫుటేజ్?

మూడు.. నాలుగు రోజుల క్రితం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టేందుకు లీగల్ ఫైట్ చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్ స్టార్ హోటల్ లో కలిసినట్లుగా చెబుతూ.. సీసీ ఫుటేజ్ బయటకు రావటం తెలిసిందే. వ్యూహాత్మకంగా టీవీ చానళ్లకు అందిన ఈ పుటేజ్ లోని అంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. కాసింత రాజకీయ రచ్చ జరిగినా.. అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి బయటకు రాని ఒక ఆసక్తికర అంశం.. ఏపీ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాస్త మాత్రమే బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ లోని మిగిలిన సీన్లు కానీ బయటకు వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. బయటకురాని ఆ సీన్లలో ఏముందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం పార్క్ హయత్ లో సుజనా చౌదరిని కలిసింది కామినేని.. నిమ్మగడ్డ మాత్రమే కాదు.. పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా. తమకు ఏమాత్రం మిత్రుడు కాని సుజనాను తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు కలిశారు? అది కూడా రహస్యంగా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ ఫుటేజ్ కానీ బయటకువస్తే.. ఏపీ అధికారపక్షానికి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంతకీ.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు సుజనా మాష్టారితో జరుపుతున్న మంతనాలు దేని కోసం? అన్నదిప్పుడు పెద్ద గుబులుగా మారిందంటున్నారు. ఇదిలా ఉంటే.. కొన్నిసీన్లు కాదు.. మొత్తం ఫుటేజ్ విడుదల చేస్తే మరింత బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. అప్పుడు రాజకీయం రసకందాయంలో పడుతుందని.. అప్పుడు ఎలాంటి కుట్ర సిద్ధాంతాన్ని తెర మీదకు తెస్తారో? అన్న ప్రశ్న కొందరి నోట వినిపిస్తోంది.