త‌మిళ‌నాడును కుదిపేస్తున్న లాక‌ప్ డెత్స్

justiceforjeyarajandfenix.. నిన్న సాయంత్రం నుంచి ఇండియా లెవెల్లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇద్ద‌రు అమాయ‌కుల‌ను పోలీసులు తీవ్రంగా హింసించి వారి మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన ఉదంతం త‌మిళ‌నాడును కుదిపేస్తోందిప్పుడు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ అదే స్థాయిలో త‌మిళ‌నాట ఉద్య‌మానికి దారి తీసేలా ఉందీ ఉదంతం. ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తూ.. రాజ‌కీయంగా కూడా దుమారానికి కార‌ణ‌మ‌య్యేలా క‌నిపిస్తున్న ఈ ఉదంతం పూర్తి వివ‌రాలు చూద్దాం.

తమిళనాడు లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను అమలు చేసింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని శాతంకులం ప్రాంతంలో కూడా లాక్ డౌన్ పెట్టారు. ఐతే వారం రోజుల కింద‌ట జయరాజ్ (59) అతని కుమారుడు ఫెనిక్స్ (31) త‌మ‌ మొబైల్ దుకాణాన్ని గ‌డువు త‌ర్వాత ఐదు నిమిషాల‌కు కూడా మూయ‌లేదు. ఇది గమనించిన శాతంకులం పోలీసులు జయరాజ్, ఫీనిక్స్‌ల‌తో దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రించారు. వాళ్లిద్ద‌రూ దీటుగా బ‌దులిచ్చారు. వాగ్వాదం జ‌ర‌గ‌డంతో ఇద్ద‌రినీ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అక్క‌డ వారిని బ‌ట్ట‌లు విప్పి రెండు మూడు రోజుల పాటు విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్ట‌డంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నార‌. వారి మోకాళ్లు ప‌చ్చ‌డ‌య్యాయి. మ‌ర్మాంగాలు దెబ్బ తిన్నాయి. ప‌రిస్థితి విష‌మించాక వారిని దగ్గరలోని కోవిల్ పట్టి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 22 న కొడుకు ఫీనిక్స్ ప్రాణాలు విడిచాడు, తండ్రి జయరాజ్ పరిస్థితి కూడా క్షీణించి త‌ర్వాతి రోజు ఆయన కూడా మృతిచెందాడు. కేవలం 24 గంటల పరిదిలో రెండు ప్రాణాలను కోల్పోయిన కుటుంబం తీవ‌క‌న విషాదంలొ మునిగిపోయింది. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఉదంతం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. రాజ‌కీయంగా పెను దుమారానికి కార‌ణ‌మైంది. ఈ కేసులో ఇద్ద‌రు ఎస్సైలు, ఇద్ద‌రు కానిస్టేబుళ్ల‌ను స‌స్పెండ్ చేశారు.