ట్రంప్ ది ఎంత మూర్ఖత్వం అంటే …

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు అత్యధిక నష్టం చవిచూస్తున్న దేశం అమెరికా. వారం కిందటి వరకు ఇటలీ కన్నీటి గాథల గురించి చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అమెరికా దాన్ని దాటేసింది. ఊహించని స్థాయిలో అక్కడ కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా భయం గొలిపేలా ఉంది.

ఆ దేశంలో గంటకు 107 మంది చనిపోతున్నారంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఒక్క రోజు వ్యవధిలో ఆ దేశంలో 2569 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. వారం కిందటి వరకు ఏదైనా దేశంలో రోజుకు వెయ్యమంది చనిపోతే వామ్మో అంటూ మాట్లాడాం. కానీ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో 2569 మంది చనిపోవడమంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఒక్క దేశంలో కరోనా మరణాలు 33 వేలకు చేరుకోవడం గమనార్హం.

ఐతే అమెరికాలో ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే అని స్పష్టమవుతోంది. ఆయన నిర్లక్ష్య ధోరణి వల్లే దేశం అతలాకుతలం అయ్యే పరిస్థితి తలెత్తిందన్నది స్పష్టం. అమెరికాలో కరోనా పేట్రేగి పోనుందని.. పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయని.. ఫిబ్రవరి 25నే అమెరికా నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ ఇంటలిజెన్స్ విభాగం ట్రంప్‌ను హెచ్చరించిందట.

కానీ ఆయన వాళ్ల సమాచారాన్ని లైట్ తీసుకున్నారు. కరోనా గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని ప్రకటన చేశారు. అప్పటికే షెడ్యూల్ అయిన భారత పర్యటన కోసం బయల్దేరి వచ్చేశారు. తిరిగి స్వదేశానికి వెళ్లాక కూడా ట్రంప్ కరోనా కట్టడి గురించి ఆలోచించలేదు. ఆ దేశంలో కరోనా కేసులు బయటపడ్డాక కూడా లాక్ డౌన్ లాంటి చర్యలేమీ చేపట్టలేదు.

జనాల నిర్లక్ష్యం కూడా తోడై ఇప్పుడు కరోనా అక్కడ విలయ తాండవం చేస్తోంది. మన దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్లు కూడా కరోనా గురించి తేలిగ్గా మాట్లాడి.. వారం తిరక్కుండానే తీవ్రతను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ ట్రంప్ మూర్ఖత్వంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టారన్నది స్పష్టం.