వైసీపీ లేడీ ఎమ్మెల్యే సైలెంట్‌.. అధిష్టానం ఫుల్ క్లారిటీ..!

గుంటూరు జిల్లా వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. మాజీ హోం మంత్రి.. మేక‌తోటి సుచ‌రిత‌.. త‌న‌కు తిరిగి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని.. భావిస్తూ..తీవ్ర‌స్థాయిలో అలిగిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టు… దీనిని ఎంపీ మోపిదేవికి ఇచ్చిన‌ట్టుగా కుమార్తె తో ప్ర‌క‌టన చేయించారు. త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో మొత్తానికే ఎస‌రు త‌ప్ప‌ద‌ని అనుకు న్నారో.. ఏమో.. వెంట‌నే రంగంలోకి దిగి స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నాలు చేశారు.

ఇది ఒక‌వైపు.. పార్టీలో ఇంకా ప‌రిస్థితి స‌ర్దు బాటు కాలేద‌నే సంకేతాలు ఇస్తున్నాయి. అంటే.. సుచ‌రిత‌.. ఇప్పట్లో యాక్టివ్ కావ‌డం క‌ష్ట‌మే. మ‌ళ్లీ ఆమె ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు.. ఆరోగ్యం బాగోలేద‌నే స్టోరీనే వినిపించ‌డం ఖాయ‌మ‌ని.. వైసీపీ నేత‌లే అంచ‌నా వేస్తున్నారు. ఇదిలావుంటే… ఇప్పుడు మ‌రో ఎస్సీ నాయ‌కురాలు… వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇంటి డాక్ట‌ర్‌గా పేరున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి కూడా అలిగారు. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో మేక‌తోటిని తొల‌గించాక‌.. త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆమె బాగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

ముఖ్యంగా.. జ‌గ‌న్ తీస‌కువ‌చ్చిన‌.. మూడు రాజ‌ధానుల విష‌యాన్ని బ‌లంగా స‌మ‌ర్ధించిన‌.. ఉండ‌వ‌ల్లి.. శ్రీదేవి.. అమ‌రావ‌తి విష‌యంలో తీవ్ర విమర్శ‌లే చేశారు. ఇక్క‌డి రైతుల‌తో సై.. అంటే సై అంటూ.. త‌ల ప‌డ్డారు. వారు చేస్తున్న ఉద్య‌మాన్ని.. పెయిడ్‌గా అభివ‌ర్ణించారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ నేత‌లు బ‌య‌ట‌కు రాకుండా.. అనేక సంద‌ర్భాల్లో కేసులు కూడా పెట్టించారు. ఇదంతా కూడా పార్టీలో త‌న పేరు మార్మోగేలా చేసింద‌న‌డంలో సందేహంలేదు.

ఎంత దూకుడుగా ఉంటే అంత మంచిదనే సూత్రాన్ని కొంద‌రు నాయ‌కులు అవ‌లంభించిన‌ట్టుగానే ఉండ‌వ‌ల్లి కూడా అనుస‌రించారు. కానీ,మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించ‌లేదు. దీంతో ఇప్పుడు ఆమె హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చేశారు. క‌నీసం.. మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారానికి కూడా రాలేదు. ఈ ప‌రిణామాల‌ను గ్ర‌హించిన వైసీపీ అదిష్టానం.. ఆమెకు ప‌రోక్షంగా కొన్నిసంకేతాలు పంపించింది. పార్టీని బ‌లోపేతం చేస్తేనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇస్తామ‌ని.. చెప్పేసింద‌ట‌. అంతేకాదు.. అల‌క రాజ‌కీయాల‌కు పార్టీ ఎట్టి ప‌రిస్థితిలోనూ ప్రాధాన‌న్యం ఇచ్చేది లేద‌ని.. తెగేసి చెప్పిన‌ట్టు ఉండ‌వ‌ల్లి వ‌ర్గం చెబుతోంది. దీంతో ఇప్పుడు.. ఆమె డోలాయ‌మానంలో ప‌డ్డార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.