వార‌సుల కోసం టీఆర్ఎస్ నేత‌ల ఆరాటం!

రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగి.. ప‌ద‌వులు చేప‌ట్టి.. వ‌య‌సు మీద ప‌డ్డాక పొలిటిక‌ల్ కెరీర్ ముగించే నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించ‌డం చూస్తూనే ఉన్నాం. సీనియ‌ర్ నాయ‌కులు త‌మ రాజ‌కీయ వార‌సత్వాన్ని వార‌సులు కొన‌సాగించాల‌ని భావిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇద్ద‌రు సీనియ‌ర్ టీఆర్ఎస్ నాయ‌కులు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ నేత‌లు ఎవ‌రో కాదు.. టీఆర్ఎస్ పార్టీలో కీల‌క‌మైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి. త‌మ‌కు వ‌య‌సు మీద ప‌డుతుండ‌డంతో ఇక వార‌సుల‌ను పొలిటిక‌ల్ బ‌రిలో దించేందుకు ఈ నాయ‌కులు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని టాక్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి తాము త‌ప్పుకుని త‌మ వార‌సుల‌కు టికెట్లు ఇప్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టార‌ని స‌మాచారం.

ఇద్ద‌రూ ఇద్దరే..

నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాకు చెందిన స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ మాస్ లీడ‌ర్లు గా గుర్తింపు తెచ్చుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సుమారు నాలుగు ద‌శాబ్దాలుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప‌లుమార్లు మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో కూడా ప్రజాసేవలో ఉన్న ఆయ‌న‌కు ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో తనయుడు భాస్కర్ రెడ్డిని అసెంబ్లీకి పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు టాక్‌.

ఇక ప్ర‌స్తుత ఆర్టీసీ ఛైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డికి కూడా నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో మంచి పట్టుంది. అందుకే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయ‌న‌కు 66 ఏళ్లు దాట‌డంతో ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని త‌న కొడుకు జ‌గ‌న్‌ను పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు.

తండ్రుల బాట‌లో..
పోచారం శ్రీనివాస్ రెడ్డి త‌న‌యుడు భాస్క‌ర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ కొడుకు జ‌గ‌న్ కూడా త‌మ తండ్రుల బాట‌లోనే సాగుతున్నారు. ఉమ్మ‌డి నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మ‌న్‌గా భాస్క‌ర్‌రెడ్డి కొన‌సాగుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నేత‌గా ఉన్నారు. త‌న తండ్రి పోచారం లాగే ఆయ‌న కూడా డీసీసీఐ ఛైర్మ‌న్‌గా రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లెట్టారు.

ఇక బాజిరెడ్డి పెద్ద కుమారుడు జ‌గ‌న్ కూడా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న కోసం కొన్నేళ్లుగా తండ్రితో క‌లిసి ఆయ‌న సాగుతున్నారు. ప్ర‌జా క్షేత్రంలో విస్త్రతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ధ‌ర్ప‌ల్లి జ‌డ్పీటీసీగా ఉన్న ఆయ‌న బాజిరెడ్డి వార‌సత్వాన్ని కొన‌సాగించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోచారం,బాజిరెడ్డి పోటీ నుంచి త‌ప్పుకుని త‌మ త‌న‌యుల‌ను నిల‌బెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.