ఎన్నాళ్లయింది ఇలాంటి దృశ్యాలు చూసి…

Newzealand

కరోనా మహమ్మాది దెబ్బకు ఇది అది అని తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ స్తబ్దత నెలకొంది. జనాలకు వినోదాన్నందించే అతి ముఖ్యమైన రంగాలైన సినిమాలు, ఆటలు మూడు నెలల కిందట్నుంచి బంద్ అయ్యాయి. కనీసం ఓటీటీల్లో కొత్త సినిమాలైనా చూసే అవకాశం ఉంటోంది కానీ.. ఆటలకు సంబంధించి అయితే కొత్త వినోదం ఏమీ లేదు.

పాత సినిమాలు చూసినట్లు పాత ఆటల వీడియోలు చూసి సంతృప్తి చెందలేరు క్రీడా ప్రేమికులు. వాళ్లకు అత్యంత వినోదాన్నందించేది లైవ్ మ్యాచ్‌లే. అవి లేక కొన్ని నెలలుగా అల్లాడిపోతున్నారు స్పోర్ట్స్ లవర్స్. ముఖ్యంగా స్టేడియాలకు వెళ్లి మ్యాచ్‌లు చూడటం అలవాటైన వాళ్లకు పిచ్చెక్కిపోతూ ఉంది. ఈ మధ్య కొన్ని దేశాల్లో కొన్ని ఆటలు పున:ప్రారంభం అయినప్పటికీ.. చాలా వరకు అభిమానుల్ని స్టేడియాలకు అనుమతించకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఏమో పరిమిత సంఖ్యలో ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నారు.

దీంతో మళ్లీ స్టేడియాలు నిండుగా కనిపించే రోజులు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు స్పోర్ట్స్ లవర్స్. ఐతే న్యూజిలాండ్‌లో మళ్లీ ఆ దృశ్యం కనిపించింది. కరోనాపై పోరాటంలో ఆ దేశం అద్భుత విజయం సాధించింది. లాక్ డౌన్‌ను పక్కాగా అమలు చేయడం, జనాలు కూడా ప్రభుత్వానికి సహకరించడంతో 20 రోజులుగా న్యూజిలాండ్‌లో కొత్త కరోనా కేసులేవీ లేవు. వాళ్లు పెట్టుకున్న గడువు కంటే ముందే న్యూజిలాండ్ కరోనా ఫ్రీ అయిపోయింది. దీంతో దేశంలో అన్ని కార్యకలాపాలూ పున:ప్రారంభం అయ్యాయి. ఆటలకూ అనుమతులొచ్చాయి. అభిమానుల విషయంలోనూ షరతులేమీ లేవు. పూర్తి స్టేడియాల్ని నింపేసుకోవచ్చు. అక్కడ రగ్బీ ప్రధాన ఆట. ఆ ఆటలో జరిగే సూపర్ రగ్బీ టోర్నీ చాలా పాపులర్.

ఈ టోర్నీలో భాగంగా శనివారం ఓ మ్యాచ్ నిర్వహిస్తే 23 వేల మంది ప్రేక్షకులతో స్టేడియం కళకళలాడింది. ఇక ఆదివారం నాడు బ్లూస్, హరికేన్స్ మధ్య ఆక్లాండ్‌లో మ్యాచ్ పెడితే.. రెస్పాన్స్ మామూలుగా లేదు. 41 వేల మందితో పూర్తిగా స్టేడియం నిండిపోయింది. అంత మంది కోలాహలం మధ్య మ్యాచ్ అద్భుతంగా సాగిపోయింది. సంబంధిత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూజిలాండ్ అభిమానుల అదృష్టం చూసి.. తమ దగ్గరా ఇలాంటి రోజులు ఎప్పుడొస్తాయో అనుకుంటున్నారు మిగిలిన దేశాల స్పోర్ట్స్ లవర్స్.