వరద బాధితులను వదిలేసి సినిమాలపై పడ్డ ప్రభుత్వం

ప్ర‌స్తుతం ఏపీలో కీల‌క‌మైన రాయ‌ల‌సీమ ప్రాంతం వ‌ర‌ద ముంపుతో అల్లాడుతోంది. గ‌త రెండు రోజుల కింద‌ట వ‌ర‌కు భారీగా కురిసిన వ‌ర్షాలు.. పెన్నా, పాపాఘ్ని న‌దుల‌కు వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో ఇక్క‌డి మూడు ఇల్లాలు చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం స‌హా నెల్లూరు ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. భారీ భ‌వ‌నాలు కూడా వ‌ర‌ద ధాటికి పేక‌మేడ‌ల్లా కూలిపోయాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులై.. ఇప్ప‌టికీ.. రోడ్డుపైనే ఉంటున్నారు. వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఆప‌న్న హ‌స్తం కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ మ‌రి ఈ స‌మ‌యంలో రాజ‌న్న రాజ్యంలో “మ‌నంద‌రి ప్రభుత్వం”-“ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం” దేవుడి ఆశీస్సులు.. ప్ర‌జ‌ల దీవెన‌ల‌తో ఏర్ప‌డిన స‌ర్కారు ఏంచేయాలి? ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాలి. వారికి భ‌రోసా నింపాలి. క్షేత్ర‌స్థాయ‌లో మ‌కాం వేసి.. ప్ర‌జ‌ల క‌న్నీళ్లు తుడిచేందుకు ప్ర‌య‌త్నించాలి.

కానీ, స‌ర్కారు మాత్రం తూతూ మంత్రంగా ప‌నిచేస్తోంది. కీల‌క‌మైన స‌మ‌యంలో కులాసాగా.. అసెంబ్లీలో సినిమాల‌పై.. ప్ర‌జ‌ల‌కు సినిమా చూపిస్తోంది. స‌మ‌యం .. సంద‌ర్భం లేకుండా..(ఎందుకంటే.. వ‌చ్చే నెల‌లో ఎలాగూ స‌భ జ‌రుగుతుంది. ఇప్పుడు అంత హ‌డావుడిగా ఈ సినిమా బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టి.. ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రంలేదు) సినిమా బిల్లును ప్ర‌వేశ పెట్టి.. గంట‌ల కొద్దీ.. చ‌ర్చించడంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలోని 1100 థియేటర్లలో ఆన్లైన్లో టికెట్ విక్రయాలు చేపట్టేందుకు ఉద్దేశించిన సినిమా టోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.

సినిమా విడుదల సమయంలో టికెట్ల ధర బ్లాక్లో రూ.200 నుంచి రూ.1000 వరకు విక్రయించే విధానం గతంలో ఉండేదని.., అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదనే ఉద్దేశంతో స‌వ‌ర‌ణ బిల్లు ప్ర‌వేశ పెట్టామ‌ని స‌ర్కారు పేర్కొంది. అంతేకాదు.. ఇక నుంచి బెనిఫిట్ షోలకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షోలకు ప్రత్యేక అనుమతి ఉంటుందని.. చారిటీస్ కోసం మాత్రమే ఈ షోలకు అనుమతి ఇస్తామని మంత్రి పేర్ని నాని వెల్ల‌డించారు. తాజా బిల్లు మేర‌కు.. ఇది చట్టంగా మారితే.. దీని ప్రకారం ఇక నుంచి రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం టికెట్లు విక్రయించే పోర్టల్ మాత్రమే నిర్వహిస్తుందని.., సినిమా టికెట్లపై వ్యాపారం చేయబోద‌న్న‌ది ప్ర‌భుత్వ మాట‌. థియేటర్ల పేరుతో రుణాలు తెచ్చుకునే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. తమ ప్రభుత్వానికి చిన్నా పెద్దా హీరోలు, రెమ్యునరేషన్ అనే వ్యత్యాసం లేదని మంత్రి అన‌డం గ‌మ‌నార్హం. స‌రే! ఏదేమైనా చేసుకోవ‌చ్చు.. కానీ.. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు.. ఒక‌వైపు వ‌ర‌ద‌ల‌తో కుమిలిపోయి.. పొట్ట చేత ప‌ట్టుకుని రోడ్డున ప‌డ్డ‌ప్పుడు.. ఆద‌రాబాద‌రాగా ఇలాంటి బిల్లుల‌పై చ‌ర్చించేసి.. ఏం సాధించాలని? అనేది ప్ర‌జాస్వామ్య వాదుల ప్ర‌శ్న‌. ఇది చూస్తే.. టీడీపీ నేత‌లు అన్న‌ట్టుగా.. తుగ్ల‌క్ పాల‌న అయినా అయి ఉండాలి.. లేదా నీరో చ‌క్ర‌వ‌ర్తి అయినా.. అయి ఉండాల‌ని నిప్పులు చెరుగుతున్నారు.