ఏపీ మంత్రుల‌కు.. ‘ఎర్రి పుష్పం’ అవార్డులిస్తాం..

Somu Veeraju

ఏపీలో బీజేపీ-వైసీపీల మ‌ధ్య నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉన్న సైలెంట్ వార్ ఇప్పుడు వీధికెక్కింది. పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల త‌గ్గింపు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసిన‌.. బీజేపీకి అంతే రేంజ్‌లో వైసీపీ మంత్రులు కౌంట‌ర్లు ఇస్తున్నారు. నిన్న‌టికి నిన్న‌.. మంత్రి పేర్ని స్పందిస్తూ.. మొత్తంగా త‌గ్గించాల్సింది మీరే.. మీరే పెంచారు.. మీరే త‌గ్గించాల‌ని.. ఏపీని త‌గ్గించ‌మ‌నే అర్హ‌త లేద‌ని చెప్పేశారు. ఇక‌, తాజాగా మాట్లాడిన‌.. మంత్రి కొడాలి నాని.. బీజేపీకి ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు పెట్రోల్ పోసి నిప్పు పెట్టార‌ని.. అందుకే.. త‌గ్గించార‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య పెట్రోల్ మంట‌లు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి.

ఈ పోరులో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ మంత్రుల పై.. తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమని అడుగుతుంటే అర్థం లేని మాటలు మాట్లాడుతూన్నారని అన్నారు. భూతులు తిట్టే మంత్రులకు ‘పద్మశ్రీ’ తరహాలోనే ఏపీలో అవార్డులు ఇవ్వాలని.. తాము అధికారంలోకి రాగానే వారికి ‘ఎర్రి పుష్పం’ అవార్డులను వీరికి ఇస్తామ‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అన్ని రాష్ట్రాలకు సహాయం చేయడం కోసమే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింద‌ని తెలిపారు. బీజేపీ పెట్రోల్, డీజిల్ ఆదయంగా మార్చుకుంటే సోలార్, ఎలక్ట్రానిక్ వాహనాలు ఎందుకు తయారు చేస్తార‌ని చెప్పుకొచ్చారు.

అదే స‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వంపైనా సోము విరుచుకుప‌డ్డారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలని అమలు చేయలేదన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో మిమ్మల్ని డేకించామ‌ని.. సీరియ‌స్ కామెంట్లుకుమ్మ‌రించారు. డీపీవోలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచారని ఎద్దేవా చేశారు. బద్వేల్ ఉపఎన్నికపై చర్చకు సిద్ధమా? అని సోము స‌వాల్ రువ్వారు. “బీజేపీ తోక పార్టీ అయితే వైసీపీకి ఏంటి న‌ష్టం? 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని మంత్రులు తెలుసు కోవాలి. ఏపీ మంత్రులు భారతదేశంలో ఉన్నారా పాకిస్తాన్ లో ఉన్నారా? ధరలు తగ్గించమని ప్రశ్నిస్తే అసత్యాలతో ప్రకటన ఇస్తారా? సమాధానం చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తే దివాలకోరు వ్యాఖ్యలు చేస్తారా?” అని వీర్రాజు ఫైర్ అయ్యారు.

అంతేకాదు.. “ఎయిడెడ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. న్యాయం చెయ్యమని అడిగితే పోలీసులతో కొట్టిస్తారా. కేంద్రం ప్రబుత్వంపై బురద చల్లాలని మీపైనే పడుతుంది. పెట్రోల్ ,డీజిల్ ధరలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై సీఎం, సీఎస్ కు లేఖ రాస్తా. డీజిల్,పెట్రోల్ కు పక్క రాష్ట్రానికి ఏపీకి 12రూపాయల తేడా ఉంది. చిప్ లిక్కర్ ను కూడా అధిక ధరకు ప్రభుత్వం అమ్మకాలు చేస్తుంది. జగన్ అన్న కానుకలు అన్ని ప్రజలపై వేసిన భారాల నుంచి ఇస్తున్నవే. మంత్రులు అంతా పచ్చ పుష్పాలు, వెర్రి పుష్పాలు. రాజధాని ఇక్కడే ఉండాలని బీజేపీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది. రాజధానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి. రాజధాని పేరు చెప్పి పన్నులు వసూలు చేస్తున్నారు” అని మండిప‌డ్డారు. బీజేపీ రూలింగ్ చేస్తుంది తప్ప బూమ్ బూమ్ బీర్లు తయారు చేయడం లేదని నిప్పులు చెరిగారు.