జగన్ ఢిల్లీ టూరు రద్దు వెనుక అంత జరిగిందా?

Jagan Amith

యావత్ దేశం ఇప్పుడు కరోనా మీద.. దాని నియంత్రణ మీద ఫోకస్ పెట్టటం తెలిసిందే. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారికి ఎలా చెక్ పెట్టాలన్న సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఫోకస్ పెట్టాయి. ఇలాంటివేళలో.. ఊహించని రీతిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు.. మరో ఇద్దరు కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వటంతో ఆయన మంగళవారం ఉదయం గన్నవరం నుంచి దేశ రాజధానికి బయలుదేరాల్సి ఉంది.

అయితే.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆఖరి నిమిషాల్లో ఏపీ సీఎం ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చిన అమిత్ షా.. తర్వాత దాన్ని కాన్సిల్ చేయటంతో ఆఖరి నిమిషాల్లో ఢిల్లీ టూర్ ను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఎందుకిలా జరిగింది? అన్న ప్రశ్నకు పలు సమాధానాలు వినిపిస్తున్నా.. అవేవీ సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహారాష్ట్ర.. గుజరాత్ లకు ముప్పుగా మారిన నిసర్గ తుపాను కారణంగా.. వాటి సమీక్షల్లో బిజీగా ఉన్న నేపథ్యంలోనే షా తన అపాయింట్ మెంట్ రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ.. అదే నిజమనుకుంటే.. ఒక గంట సమయాన్ని జగన్ కు ఇవ్వలేనంత బిజీగా ఏమీ లేరన్న మాట వినిపిస్తోంది. జగన్ కు తానిచ్చిన అపాయింట్ మెంట్ క్యాన్సిల్ వెనుక సమయాభావం అన్నది కారణమే కాదని.. అంతర్గత అంశాలే కారణంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇటీవల కాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. ఆర్డినెన్సు ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను పదవి నుంచి తొలగించటం.. ఆయన స్థానే మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను తెర మీదకు తీసుకురావటం.. ఈ నిర్ణయాన్నిఏపీ హైకోర్టు తప్పు పట్టటం తెలిసిందే. కోర్టులో పిటిషన్ వేసిన వారిలో ఏపీ బీజేపీ నేత కమ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉండటం తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర పెద్దల్ని కలవటం ద్వారా.. తాను ఇవ్వాల్సిన వివరణను ఇచ్చే ఉద్దేశం జగన్ కు ఉందని చెబుతున్నారు.

ఓపక్క జగన్ కు వ్యతిరేకంగా ఏపీ కమలనాథులు పోరాడుతున్నారు. ఇదే సమయంలో దేశ రాజధానిలో కేంద్ర పెద్దల్ని కలుసుకునే అవకాశం ఇస్తే.. రాంగ్ సిగ్నల్స్ వెళ్లే ప్రమాదం ఉందన్న ఆలోచనతోనే ఆఖరి నిమిషాల్లో అపాయింట్ మెంట్ ను కాన్సిల్ చేశారని చెబుతున్నారు. తాజా నిర్ణయంతో.. ఏపీ ముఖ్యమంత్రికి తగినంత సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది.

రాష్ట్రంలో ఏదైనా తలనొప్పి ఎక్కువ అయితే.. ఢిల్లీకి వెళ్లే అలవాటున్న జగన్.. తాజాగా అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఏపీ కమలనాథులు.. పార్టీ పెద్దలకు సందేశాన్ని అందించారని.. దీంతో అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఆఖరి నిమిషం వరకూ ప్రయాణానికి సిద్ధమైన తర్వాత షెడ్యూల్ మారటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.