యూట్యూబ్ లో పద్యం పాడిన జొన్నవిత్తుల మీద కేసు నమోదు

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై తాజాగా కేసు నమోదైంది. సాత్వికుడిగా పేరున్న ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ కావటం సంచలనంగా మారింది.

ఇంతకీ ఆయన చేసిన తప్పేమిటన్న విషయంలోకి వెళితే.. యూట్యూబ్ లో పద్యం పాడటమే నేరమైందన్న మాట వినిపిస్తోంది. ఏంటి? యూట్యూబ్ లో పద్యం పాడి.. అప్ లోడ్ చేసినందుకే కేసు పెడతారా? అన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇక్కడ జరిగింది వేరంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఒక టీవీ లైవ్ షోకు వెళ్లిన జొన్నవిత్తుల.. తన మాటల సందర్భంలో ఒక పాట పాడారు. ఆ పాటలో అంటరానితనాన్ని కొనసాగించేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మార్చి 23న కరోనా మీద పద్యం పాడారని.. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి వేళ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అయితే.. ఈ వీడియోలో జొన్నవిత్తుల పాడిన పాట ఎస్సీ.. ఎస్టీ వర్గాల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటున్నారు.

ఈ విషయంపై మాల సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్.. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

ఈ ఉదంతంలో తదుపరి చర్యల కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి.. తనపై కేసు నమోదుపై జొన్నవిత్తుల ఎలా రియాక్టు అవుతారో చూడాలి.