బిగ్ బ్రేకింగ్.. ఏపీ సీఈసీ రీఎంట్రీ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు హైకోర్టు మరో పెద్ద షాక్ ఇచ్చింది. వివాదాస్పద రీతిలో పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేుష్ కుమార్‌ను తిరిగి ఆ పదవిలో నియమించాలని ఆదేశఆలు జారీ చేసింది. రమేష్ కుమార్‌ను తప్పించడం కోసమే జగన్ సర్కారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నియామకం, పదవీకాలం విషయమై కొత్తగా రూపొందించిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది.

ఆర్టికల్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం లేదని హైకోర్టు పేర్కొంది. రమేశ్‌ కుమార్‌ను తిరిగి కమిషనర్‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారని రమేశ్‌ కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌, తదనంతర జీవోలపై దాఖలైన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం విచారించి ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయమై ప్రభుత్వానికి, సీఈసీ రమేష్ కుమార్‌కు మధ్య రగడ మొదలైంది. కరోనా వ్యాప్తి పెరుగుతుందన్న కారణం చూపి ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని జగన్ సర్కారు తీవ్రంగా ఆక్షేపించింది. రమేష్ కుమార్ చంద్రబాబు తొత్తు అని ఆరోపిస్తూ ఆయనకు కుల జాఢ్యాన్ని కూడా ఆపాదించారు.
జగన్‌తో పాటు పలువురు వైకాపా నాయకులు రమేష్ కుమార్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ తర్వాత ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి మరీ రమేష్ కుమార్‌ను పదవి నుంచి తప్పించింది ప్రభుత్వం.

ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన కనకరాజ్‌ను తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టారు. ఐతే తనపై వేటు పడ్డ వెంటనే రమేష్ కుమార్ కోర్టు గడప తొక్కారు. దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి తనను తప్పించిందంటూ పిటిషన్ వేయగా.. ఆయనకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించింది.