హైకోర్టు జడ్జిలపై ఆ వ్యాఖ్యలకు ఎలాంటి శిక్షలంటే?

నిర్లక్ష్యం.. అంతకు మించిన తెంపరితనం వెరసి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలోనూ.. వీడియో క్లిప్పులతో విరుచుకుపడిన వైనం సంచలనంగా మారింది. ఇంత తీవ్రస్థాయిలో హైకోర్టు జడ్జిల మీద ఘాటు వ్యాఖ్యలతో పాటు.. అభ్యంతరక.. అసభ్యపదజాలంతో చేసిన వ్యాఖ్యల నేరం రుజువైతే ఎలాంటి శిక్షలు ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఏపీ హైకోర్టు ఫుల్ బెంచ్ కొలువుతీరి.. తమపై సోషల్ మీడియాలో చేస్తున్న విపరీత ప్రచారంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పులపై ప్రసార..సామాజిక మాధ్యమాల్లో కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇష్టమొచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేసిన వారిలో 49 మందిని గుర్తించగా.. వారిలో తాజాగా ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిపై పెట్టిన నేరారోపణలు నిజమని తేలితే వారికి కఠిన శిక్షలు ఖాయమని చెప్పక తప్పదు.

ఐటీ చట్టం 2000 సెక్షన్ 67 ప్రకారం ఎలక్ట్రానిక్.. డిజిటల్ మాధ్యమాల్లో అశ్లీల సందేశాల్ని ప్రచురించటం.. పంపటం నేరం. ఇలాంటి పని తొలిసారి చేస్తే మూడేళ్ల వరకు జైలుశిక్ష.. రూ.5లక్షల వరకూ జరిమానా విధిస్తారు. ఇదే నేరం రెండోసారి కూడా చేస్తే ఐదేళ్ల వరకూ జైలుశిక్ష రూ.10లక్షల జరిమానా విధిస్తారు.

ఐపీసీ 505(2) ప్రకారం కులాలు.. మతాలు.. జాతులు.. ప్రాంతాలు.. వర్గాల మధ్య వైషమ్యాలు.. శత్రుత్వం పెంచేలా వ్యాఖ్యలు చేయటం.. వదంతులు వ్యాపింపచేయటం.. ప్రచురించటం నేరం. ఇందుకు మూడేళ్ల వరకు జైలుతోపాటు జరిమానా విధిస్తారు. ఈ బెదిరింపుల కారణంగా ఆస్తుల ధ్వంసానికి కానీ.. ఎవరైనా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే వారికి జీవితకాల జైలుశిక్ష విధించొచ్చు.

ఐపీసీ 153ఏ కింద కేసుల్ని నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసి.. నేరం నిరూపితమైతే ఐదేళ్ల వరకూ జైలుశిక్ష.. జరిమానా విధిస్తారు. ఇందులో లిఖితపూర్వకంగా కానీ నోటిమాటగా కానీ సైగల ద్వారా కానీ కులాలు.. మతాలు.. జాతులు.. ప్రాంతాలు.. వర్గాల మధ్య వైషమ్యాలు.. శత్రుత్వం పెంచేలా చర్యలకు పాల్పడితే ఈ సెక్షన్ కింద కేసు పెడతారు.