బాబుగారి సీబీఐ కామెడీపై కౌంట‌ర్లు

YS-Jagan-Chandrababu-Naidu

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసిన న‌ర్సీప‌ట్నం డాక్ట‌ర్ సుధాక‌ర్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ‌టం.. ఆయ‌న ఇటీవ‌ల అర్ధ‌న‌గ్న స్థితిలో రోడ్డు మీద క‌నిపించ‌డం.. ఆయ‌న్ని పోలీసులు చేతులు, కాళ్లు క‌ట్టి ఆటోలో ప‌డేసి తీసుకెళ్లడం ఎంత‌గా చ‌ర్చ‌నీయాంశం అయిందో తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం కోర్టు వ‌ర‌కు వెళ్ల‌గా.. ఉన్న‌త న్యాయం స్థానం సీరియ‌స్ అవడం, రాష్ట్ర ప్ర‌భుత్వం మీద న‌మ్మకం లేక‌, నివేదిక కోసం ఈ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డం సంచ‌ల‌నం రేపింది. ఐతే ఇది సీబీఐకి ఇవ్వ‌ద‌గ్గ కేసేనా అనే విష‌యంలో ర‌క‌ర‌కాల అభిప్రాయాలున్నాయి. ఐతే జ‌గ‌న్ స‌ర్కారుకు మాత్రం ఇది గ‌ట్టి ఎదురు దెబ్బ అన‌డంలో సందేహం లేదు.

ఐతే ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన‌పుడ‌ల్లా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు లైన్లోకి వ‌స్తుంటారు. ఇప్పుడు కూడా వ‌చ్చేశారు. డాక్ట‌ర్ సుధాక‌ర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్ప‌గించ‌డాన్ని తాను స్వాగ‌తిస్తున్న‌ట్లు ట్వీట్ వేశారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సుధాక‌ర్ ప‌ట్ల పోలీసులు అంత దారుణంగా వ్య‌వ‌హ‌రించడంలో ప్ర‌భుత్వ పాత్ర‌ను బ‌య‌టికి తీస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఐతే ఇదే చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా సీబీఐ విష‌యంలో ఏం చేశార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌స్తావ‌నార్హం. రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్ట‌కుండా ఆయ‌న చ‌ట్టం తీసుకొచ్చారు. కొన్ని కేసుల‌కు సంబంధించి తెలుగుదేశం నాయ‌కుల‌తో సీబీఐ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును త‌ప్పుబ‌ట్టారు. సీబీఐపై తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేశారు. కానీ ఇప్పుడేమో సీబీఐని పొగుడుతున్నారు. సుధాక‌ర్ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డాన్ని స్వాగతిస్తున్నారు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంట‌ర్లు ప‌డుతున్నాయి.