కరోనాతో ఆస్పత్రిలో భర్త.. వీర్యం కావాలంటూ భార్య..!

కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన భర్త వీర్యం కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్ రాష్ట్రం వడోదరాకు చెందిన ఓ మహిళకు ఏడాది క్రితం వివాహమైంది. ఇటీవ‌ల ఆ మ‌హిళ భ‌ర్త క‌రోనా బారిన ప‌డి వ‌డోద‌రాలోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా మార‌టంతో డాక్ట‌ర్లు కూడా చేతులెత్తేసే ప‌రిస్థితికి వ‌చ్చేసింది. త‌న అవ‌య‌వాల‌న్ని దెబ్బ‌తిన్నాయ‌ని డాక్ట‌ర్లే ధృవీక‌రిస్తున్నారు.

దీంతో త‌మ బంధాన్ని బిడ్డ రూపంలో అయిన కాపాడుకోవాల‌ని ఆలోచించిన ఆ మ‌హిళ… త‌న భ‌ర్త నుండి సేక‌రించిన వీర్యంతో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తితో త‌ల్లి కావాల‌ని భావించింది. కానీ క‌రోనా బాధితుడి నుండి వీర్యం సేక‌రించేందుకు ఆసుప‌త్రి వ‌ర్గాలు అనుమ‌తి నిరాక‌రించి, కోర్టు ఆదేశిస్తే చేస్తామ‌ని తెలిపాయి. దీంతో ఆ మ‌హిళ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించింది.

కోర్టు కూడా ఆ మ‌హిళ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని… ఆ పేషెంట్ నుండి వెంట‌నే వీర్యం సేక‌రించి భ‌ద్ర‌ప‌ర్చాల‌ని సూచించింది. ఐవీఎఫ్ ద్వారా గ‌ర్భం దాల్చేందుకు అత‌డి భార్య‌కు అందించి స‌హ‌క‌రించాల‌ని తెలిపింది.