విమానాల్లో వాయించేస్తున్నారుగా…

రెండు నెలలుగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు లేక సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలతో పాటు ఉన్నత వర్గాల వాళ్లందరూ ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వలస కూలీలు, సామాన్యుల కోసం రైళ్లు, బస్సులు పున:ప్రారంభించారు కానీ.. ప్రయాణాల కోసం విమానాల్నే ఆశ్రయించే వారు మాత్రం తమకెప్పుడు వెసులుబాటు లభిస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఐతే వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం అంతర్జాతీయ ప్రత్యేక విమానాలు నడిపిన ప్రభుత్వం.. రోజు వారీ సర్వీసుల్ని ఈ నెల 25న మొదలుపెట్టాలని నిర్ణయించింది. భౌతిక దూరం, మాస్కులు, గ్లౌజులు సహా అనేక విషయాల్లో కట్టుదిట్టమైన నిబంధనల మధ్య ఈ ప్రయాణాలు సాగనున్నాయి. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే విడుదలయ్యాయి. దీంతో పాటు టికెట్ల రేట్ల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించింది.

విమాన యాన సంస్థలు ఈ సమయంలో డిమాండును బట్టి ఇష్టానుసారం రేట్లు పెట్టి ప్రయాణికుల్ని దోచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వే రేట్ల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రయాణ సమయాన్ని బట్టి దేశీయ ప్రయాణాల్ని ఆరు సెక్టార్లుగా విభజించారు.

40 నిమిషాల లోపు ప్రయాణ సమయంలో ఉన్న ‘ఎ’ సెక్టార్లో ఛార్జీ కనీసం రూ.2 వేల నుంచి గరిష్టగా రూ.6 వేలు పెట్టుకోవచ్చు. 40-60 నిమిషాల మధ్య ప్రయాణ సమయం ఉంటే.. రూ.2500-7500 మధ్య, 60-90 నిమిషాల మధ్య అయితే రూ.3000-9000 మధ్య 90-120 నిమిషాల మధ్య అయితే రూ.3500-10000 మధ్య, 120-150 నిమషాల మధ్య అయితే రూ.4500-13000 మధ్య, 150-180 నిమిషాల మధ్య అయితే రూ.5500-15700 మధ్య, 180-200 నిమిషాల మధ్య అయితే రూ.6500-రూ.18600 మధ్య ఛార్జీలు ఉండాలని ప్రభుత్వం షరతులు విధించింది. అంటే కనిష్టంగా రూ.2 వేలతో మొదలై.. గరిష్టంగా రూ.18600కు మించకుండా దేశీయ విమాన ఛార్జీలు ఉండబోతున్నాయన్నమాట.