కేసీఆర్ నిర్ణయానికి షాకిస్తూ హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. కొద్దికాలంగా పలు మీడియా సమావేశాల్లో ఆయన వినిపిస్తున్న వాదనను కొట్టిపారేసేలా తాజాగా ఇచ్చిన హైకోర్టు తీర్పు ఉండటం గమనార్హం. మాయదారి రోగాన్ని గుర్తించేందుకు వీలుగా నిర్వహించే టెస్టులను ప్రైవేటు సంస్థలు కూడా చేయొచ్చంటూ ఐసీఎంఆర్ అనుమతిని ఇచ్చింది. తెలంగాణలోని 12 సంస్థలకు ఈ పరీక్షలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే.. ఐసీఎంఆర్ ఇచ్చిన ఆదేశాలకు నో చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రైవేటు ల్యాబ్ లలో నిర్దారణ పరీక్షలు చేయటానికి.. ప్రైవేటు ఆసుతప్రులు చికిత్స చేయటానికి అనుమతికి నో చెప్పింది. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా మాయదారి రోగానికి అవసరమయ్యే నిర్దారణ పరీక్షలు.. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రుల్ని భరించే శక్తి ఉన్న వారికి.. ఆ వెసులుబాటు కల్పించాల్సిందిగా ఆసుపత్రులు తమ వాదనను వినిపించాయి.

దీనికి సానుకూలంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేశారు. నిర్దారణ.. చికిత్సకు అయ్యే ఖర్చుకు సంబంధించి ఐసీఎంఆర్ ఆదేశించిన విధంగానే ఫీజులు వసూలు చేయాలే తప్పించి.. ఎక్కువ తీసుకోకూడదని ఆదేశించింది. అంతేకాదు.. నిర్దారణ పరీక్షలు.. చికిత్స చేయటానికి ప్రైవేటు ల్యాబులు.. ఆసుపత్రుల యజమాన్యాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. మొత్తంగా ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలిందన్న మాట వినిపిస్తోంది.