ఏపీ ఉద్యోగుల వేదన తీరింది

ఓవైపు సంక్షేమ పథకాలకు వేల కోట్ల నిధులు విడుదల చేస్తూ.. తమకు మాత్రం కోతలు విధించడం ఏంటంటూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులుగా. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడంతో గత రెండు నెలలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. మే నెలలో కూడా ఇదే పద్ధతి కొనసాగితే తామంతా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటామంటూ ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఐతే వారి ఆందోళలను తీర్చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించారు. జూన్ 1న మే నెల జీతాలు ఇవ్వబోతుండగా.. ఉద్యోగులకు పూర్తి మొత్తం చెల్లించాలంటూ ఫైనాన్స్, ట్రెజరీలకు ఆదేశాలు అందాయి.

గత రెండు నెలలు సగం జీతమే పడేలా ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. దాన్ని మార్చి పూర్తి జీతం ఉద్యోగులకు చేరేలా చూస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదల కానుంది. గత రెండు నెలల్లో కోత విధించిన 50 శాతం జీతాన్ని కూడా బకాయిల రూపంలో త్వరలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, వ్యాపారాలు కూడా పాక్షికంగా తెరవడంతో ఈ నెల ప్రభుత్వానికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆదాయం అందింది. దీంతో జీతాలకు ఇబ్బంది అయితే లేదు. ప్రభుత్వ పథకాలకు భారీగా నిధులు కేటాయిస్తూ జీతాల్ని ఇలా కోత పెడుతూ పోతే ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన మార్చుకుంది. ఉద్యోగులకు గత రెండు నెలల్లో 50 శాతం జీతం కోసిన ప్రభుత్వం పింఛనుదారులకు కూడా 40 శాతం కట్ చేసింది. ప్రజా ప్రతినిధులకు గత రెండు నెలలు పూర్తిగా జీతాల్లో కోత విధించారు.