నా భర్త చనిపోయాడని గ్యారంటీ ఏంటి? – కరోనా మృతుడి భార్య

ఆ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కుటుంబ పెద్దతో పాటు పెళ్లై భార్యాపిల్లలున్న అతడి కుమారుడు కూడా మరణించాడు. మిగిలిన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. కుటుంబ పెద్ద చనిపోయిన విషయం వారికి తెలిసినా.. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడి కుమారుడి మరణవార్త మాత్రం ఆ ఫ్యామిలీకి తెలియలేదు. ఈలోగా కుటుంబ పెద్దతో పాటు అతడి కుమారుడి మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిగిపోయాయి. ఈ తంతు తెలియని ఆ కుమారుడి భార్య… తన భర్త జాడ తెలియడం లేదంటూ ఫిర్యాదు చేసింది. నేరుగా మంత్రి కేటీఆర్ కు కూడా కంప్లైంట్ చేసింది. మొత్తంగా రెండో మరణానికి చెందిన సమాచారం ఆ కుటుంబానికి తెలియలేదు. ఈ సమాచారాన్ని ఆ కుటుంబానికి ఇవ్వకుండానే మృతుడి అంత్యక్రియలు ముగిసిపోయాయి. ఇది ఇప్పుడు తెలంగాణలో పెను వివాదంగానే మారిపోయింది. దీనిపై స్పందించిన మరో మంత్రి ఈటల రాజేందర్ అసలు విషయం ఇదంటూ స్పందించారు.

ఈ స్పందనలో ఈటల ఏమన్నారంటే… ‘‘వనస్థలిపురానికి చెందిన ఈశ్వరయ్య కుటుంబం మొత్తానికి కరోనా సోకింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే ఈశ్వరయ్య మృతి చెందారు. ఆయన కుమారుడు మధుసూదన్ అదే రోజు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. ఈ నెల 1న చనిపోయారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పాము. అయితే తన భర్త చనిపోయాడని భార్యకు తెలిస్తే షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంలో ఆమెకు ఈ విషయం చెప్పలేదు. అప్పటికే ఒకరిని కోల్పోయారు. మరొకరి మృతి గుచించి చెబితేతట్టుకోలేరని వాళ్ల సన్నిహితులు కూడా చెప్పారు. అంతేకాకుండా ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ కరోనాతో ఆస్పత్రిలోనే ఉండటంతో ప్రభుత్వమే దహన సంస్కారాలు చేసింది. మృతదేహాన్ని ఫ్రీజర్ లో పెట్టే పరిస్థితి లేదు’’ అని ఈటల చెప్పుకొచ్చారు.

మొత్తంగా తన అనుమతి లేకుండా తన భర్త అంత్యక్రియలు ఎలా చేస్తారని మధుసూదన్ భార్య మాధవి ఆవేదన వ్యక్తం చేయడంలో అర్థం ఉన్నా… కరోనాతో మొత్తం ఫ్యామిలీ ఆస్పత్రిలో ఉండటం, అప్పటికే కుటుంబ పెద్దను కోల్పోయిన షాక్ లో మాధవి సహా ఇతర కుటుంబ సభ్యులు ఉండటం, ఈ క్రమంలో మధుసూదన్ చనిపోయిన విషయాన్ని మాధవికి తెలియకుండానే అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వ వాదన కూడా కరెక్టుగానే అనిపిస్తోంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి కారణంగా భర్త చనిపోతే… భార్యకు తెలియకుండానే ఆ భర్త మృతదేహానికి అంత్యక్రియలు జరిగిపోవడం నిజంగానే ఆవేదనాభరితమే. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో అంతకు మించిన మార్గాంతరం కూడా లేదన్న విషయాన్ని మాధవి కూడా అర్థం చేసుకోవాలన్న వాదన కూడా వినిపిస్తోంది.