లాట‌రీ త‌గిలితేనే స్వ‌స్థ‌లాల‌కు..

ఉన్న చోట పూట గ‌డ‌వ‌క.. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు వ‌ల‌స కార్మికులు ప‌డుతున్న క‌ష్టాలేంటో గ‌త కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. వాళ్ల క‌ష్టాలు చూసి క‌న్నీళ్లు వ‌చ్చేస్తున్నాయి జ‌నాల‌కు. ఐతే వీరి కోసం ప్ర‌త్యేక రైళ్లు, బ‌స్సులు ఏర్పాటు చేశాక కూడా కార్మికులు కాలిన‌డ‌క ఆప‌ట్లేదు. ఎండ‌ల్లో త‌ట్టాబుట్టా నెత్తిన పెట్టి.. పిల్ల‌ల్ని వెంట పెట్టుకుని న‌డ‌క సాగిస్తున్నారు. మ‌రి ప్ర‌భుత్వం ప్ర‌యాణ ఏర్పాట్లు చేసినా వీళ్లెందుకు ఇంత క‌ష్ట‌ప‌డుతున్నార‌న్న సందేహం రావ‌డం స‌హ‌జం. ఐతే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైళ్లు.. వ‌ల‌స కార్మికుల‌కు ఏమాత్రం స‌రిపోయేలా లేక‌పోవ‌డం, త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డంతోనే వాళ్లు అంత క‌ష్టానికి సిద్ధ‌ప‌డుతున్నారు.

ఒక్కో రైల్లో 1200-1400 మంది మాత్రమే వెళ్లేందుకు వీలుండటం, కార్మికులు వేల సంఖ్యలో ఉండటంతో ఎవ‌రిని స్వ‌స్థ‌లాల‌కు పంపాల‌నే విష‌యంలో తెలంగాణ‌ ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. తొలుత కార్మికులందరూ తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించడంతో తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. ఇలా పేర్లు న‌మోదు చేసుకున్న అంద‌రికీ ప్ర‌యాణ ఏర్పాట్లు చేయ‌డం క‌ష్టంగా ఉంది. దీంతో ఒక్కో రైలుకు ప్రతి ప్రాంతం నుంచి 10-15 మందికి అవకాశం కల్పించాలని, వారిని ఆయా స్టేషన్‌లకు బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం లాట‌రీ వేస్తున్నారు.

అందులో ఎంపికైన 15 మందికి ప్ర‌యాణ ఏర్పాట్లు చేస్తు‌న్నారు. ఇప్పటివరకు ఇలా 80 వేల మందిని త‌ర‌లించారు. 15 రోజుల క్రితం పేరు నమోదు చేసుకున్న వారికి కూడా ఇంకా పిలుపు రాకపోవవడంతో అనేక మంది ఆందోళన చెందుతున్నారు. లాట‌రీలో త‌మ పేర్లు ఎప్పుడొస్తాయో తెలియ‌క కొన్ని రోజులు ఎదురు చూసి కాలిన‌డ‌క‌న స్వ‌స్థ‌లాల‌కు బ‌య‌ల్దేరుతున్నారు కొంద‌రు కార్మికులు. ఇంకొంద‌రేమో ట్రక్కులను, అద్దె వాహనాలను ఆశ్రయిస్తున్నారు.