కరోనా అదుపులోకి వస్తేనే స్కూళ్లు !

పిల్లల చేసేదే అల్లరి. కలిసి ఆడుకోవడంలోనే వారికి సంతోషం. ఆటలు, చదువు తప్ప వారికి ఈ ప్రపంచంతో ఇంకేమీ సంబంధం లేదన్నట్లు జీవిస్తారు. ఏం చేయొద్దని చెబుతామో అది చేయడమే వారికి ఆనందాన్నిస్తుంది.

కరోనా రాకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కువేసుకోవడం వంటివి వారు 24 గంటలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటారనుకోవడం అసాధ్యం. వారి నుంచి మనం అది ఆశించడం కూడా తప్పు. అందుకే కరోనా అదుపులోకి రాకుండా స్కూల్స్ ఓపెన్ చేస్తే ఎలా వాళ్లను రక్షించుకునేది అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

దేశంలో కోవిడ్ 19 అదుపులోకి వచ్చే వరకు పాఠశాలలు తెరిచే ప్రసక్తే లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించారు. అంటే లాక్ డౌన్ కి స్కూళ్లకు సంబంధం లేదు. భావితరాలను కాపాడుకోవడం దేశపు ప్రథమ ప్రయారిటీ అని మంత్రి వ్యాఖ్యానించారు.

అదుపులోకి వచ్చాక పాఠశాలలు ప్రారంభించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం దృష్టిపెట్టింది. ఎపుడైతే పాఠశాలలు ఓపెన్ చేస్తారో… అపుడు తొలుత 30 శాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా స్కూళ్లను ప్రారంభించాలని కేంద్రం సూచించింది.

ఇతర గైడ్ లైన్స్ రూపొందించడంలో ఎన్.సి.ఇ.ఆర్.టి (NCERT) తలమునకలై ఉంది. ఏడాది పాటు స్కూల్లో ఎటువంటి ప్రార్థనలు, సమావేశాలు, సెమినార్లు ఉండవని చెబుతున్నారు. భౌతిక దూరం బాధ్యత కచ్చితంగా టీచర్లు, పాఠశాలలదే అని కేంద్రం సూచించింది. అవకాశం ఉంటే స్కూల్స్ ను షిఫ్టుల్లో నడిపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా… ‘పేరెంట్ సర్కిల్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో పాఠశాలలు ప్రారంభించిన తరువాత, దాదాపు నెల రోజుల వరకు తమ పిల్లలను స్కూలు పంపమని చాలామంది తల్లిదండ్రులు తెలిపారు. దీన్ని బట్టి తల్లిదండ్రులు దీని పట్ల ఎంత అప్రమత్తంగా ఉన్నారో ఇట్టే అర్థమైపోతుంది.