ఇంగ్లీష్ మీడియం: వైసీపీ వర్సెస్ బీజేపీ

ప్రపంచమంతటా కరోనాయే ప్రధాన టాపిక్‌గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంగ్లీష్ మీడియం వివాదం అంతకంటే పెద్ద టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య వివాదంగా మారింది.

ఇంగ్లీష్ మీడియం అమలుపై కోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నా కూడా ముందుకెళ్లేందుకే డిసైడైన ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో నంబర్ 24 ఇవ్వడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఎస్‌ఈఆర్‌టీ చేసిన సిఫారసులకు ఆమోదం తెలుపుతూ ఈ జీవో విడుదల చేశారు. దీని ప్రకారం ఇంగ్లీష్ మీడియంలో బోధనకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పాఠశాల విద్యాశాక కమిషనర్ చూసుకుంటారని ఆ జీవోలో ఉంది.

మరోవైపు ఇంగ్లీష్ మీడియం బలవంతంగా అమలు చేయడానిక ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న భాషాభిమానులు, తెలుగు మీడియం కోసం పోరాడుతున్న పిటిషనర్లు మాత్రం జీవో నంబర్ 24ను వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో చెల్లదని.. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని అంటున్నారు.

అసలేమిటీ వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని భావించిన ప్రభుత్వం అందుకోసం జీవో నంబర్ 81, 85లను కొద్ది నెలల కిందట విడుదల చేసింది. ఈ రెండు జీవోల్లో మొదట జీవో నంబర్ 81 విడుదల చేశారు. దాని ప్రకారం 1 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం పెడతామన్నారు.

కానీ, అభ్యంతరాలు రావడంతో 1 నుంచి 6 తరగతుల వరకేనంటూ జీవోనంబర్ 85 రిలీజ్ చేశారు. ఆ తరువాత విపక్షాలు, భాషాభిమానుల నుంచి వ్యతిరేకత మొదలవడంతో మరికొన్ని మార్పులు చేస్తూ అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో తెలుగు ను తప్పనిసరి సబ్జెక్టు చేస్తూ జీవో 89ను 2019 డిసెంబరులో ఇచ్చారు.

అయితే, వీటన్నిటిపైనా బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్ అనే ప్రొఫెసర్ హైకోర్టునాశ్రయించారు. దీంతో కోర్టు మాధ్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉండాలని తీర్పిచ్చింది. జీవో 81, 85లు చెల్లవని కోర్టు చెప్పింది.

మాధ్యమం నిర్ణయించాల్సింది ప్రభుత్వం కాదని, ఎస్‌ఈఆర్‌టీ అని చెప్పింది. దీంతో ప్రభుత్వం వెంటనే తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించి 96.17 శాతం ఆమోదించారని చెబుతూ ఎస్‌ఈఆర్‌టీకి వివరాలివ్వడంతో ఇప్పుడు ఎస్ ఈ ఆర్ టీ ఆంగ్లీష్ మీడియంను సిపారసు చేస్తూ నివేదిక ఇచ్చింది.

ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం మళ్లీ ఇంగ్లీష్ మీడియం కోసం జీవో నంబర్ 24 రిలీజ్ చేసింది. కాగా ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవో నేపథ్యంలో సుధీష్ రాంభొట్ల స్పందించారు. ఈ జీవో తప్పులతడక అని.. ఇది కూడా చెల్లుబాటు కాదని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఈ జీవోను తెచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు.