మా చెల్లెలకు ఉద్యోగం ఎందుకు రాలేదంటే.. ఏపీ డిప్యూటీ సీఎం వివరణ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కులంపై రగడ గురించి తెలిసిందే. ఆమె చెప్పుకుంటున్నట్లుగా డిప్యూటీ సీఎం ఎస్టీ కాదన్న ఆరోపణల్ని పలువురు సంధిస్తున్నారు. ఈ కారణంతోనే ఆమె సోదరికి డీఎస్సీ ఉద్యోగం రాలేదని.. ఆమెను అనర్హులుగా గుర్తించినట్లు ఆరోపిస్తున్నారు. నిజానికి పుష్పవాణి కుల రగడ ఇప్పుడే మొదలుకాలేదు. ఆమె నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ఉంది.అంతకంతకూ ఎక్కువ అవుతున్న ఆరోపణల జోరుకు బ్రేకులు వేసేందుకు పుష్పవాణి ఒక అడుగు ముందుకేశారు.

తాజాగా తన సందేశాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. అందులో తన మీద వస్తున్న ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. తన కులంపై జరుగుతున్న వివాదం మొత్తం కుట్రలో భాగమన్నారు. తొలుత తన సోదరి అనర్హత మీద ఆమె వివరణ ఇచ్చుకున్నారు. 2008 ప్రత్యేక డీఎస్సీలో కేఆర్ పురం ఐటీడీఏలో స్కూల్ అసిస్టెంట్ గా తన సోదరి తులసి ఎంపిక అయ్యారని చెప్పిన ఆమె.. “జీవో నెంబరు 3 ప్రకారం ఆ ఉద్యోగానికి స్థానికులే అర్హులు. అందుకే ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. మేం ఎస్టీ కాదు కాబట్టే ఆ ఉద్యోగం రాలేదని కొందరు ఆరోపిస్తున్నారు. అది నిజం కాదు” అని చెప్పారు.

తాము ఎస్టీలం కాదని ఎవరైనా రుజువు చేయగలరా? అని ప్రశ్నించిన ఆమె.. ఎస్టీ కాకుంటే తమ కుటుంబం మొత్తానికి 2014లోనే డిజిటల్ ధ్రువపత్రాలు ఎలా మంజూరు చేస్తారన్నారు. తనకు రాజకీయాలు తెలియని రోజుల్లోనే తమకీ పత్రాలు అందజేసినట్లు చెప్పారు. ఎన్నికల నామినేషన్ వేళలో తమ కుల ధ్రువపత్రాలు చెల్లవని..నామినేషన్ ను తిరస్కరించాలని కొందరు కంప్లైంట్ చేశారని గుర్తు చేశారు.

అయితే.. తమ ధ్రువపత్రాల్ని ఆర్వోకు చూపించటంతో అనుమతి లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని టీకే పారాపురానికి వెళ్లి తమ కుటుంబం గురించి దర్యాప్తు చేస్తే.. వాస్తవాలు తెలుస్తాయన్న ఆమె.. తమ మీద అనవసరంగా ఆరోపణలు ఎవరుచేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారన్నది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. ఇంత స్పష్టంగా తన కులం మీద వివరణ ఇచ్చిన తర్వాత అయినా ఏపీ డిప్యూటీ సీఎంకు ఆ తలనొప్పి తీరుతుందో లేదో చూడాలి.