మోడీ సర్కారును ఉతికారేసిన కేసీఆర్

కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు మొదలైనప్పటి నుంచి కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల సానుకూల వైఖరితోనే కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జనతా కర్ఫ్యూ సహా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సపోర్టివ్‌గానే మాట్లాడారు. కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా మోడీ చప్పట్లు కొట్టమన్నా.. దీపాలు వెలిగించమన్నా.. వాటి గురించి ఎండోర్స్ చేశారు. తాను స్వయంగా అనుసరించారు.

మోడీని ఎగతాళి చేసిన వాళ్లకు కూడా గడ్డి పెట్టారు. పలు సందర్భాల్లో కేంద్రం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించారు. కానీ కేంద్రం నుంచి ఈ కష్ట కాలంలో సరైన సాయం అందకపోవడం, తాను మంచి సూచనలు చేసినా విస్మరించడం ఆయనకు కాక తెప్పించినట్లుంది. తాజా ప్రెస్ మీట్లో కేంద్రం తీరును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు కేసీఆర్. నేషనల్ మీడియా ప్రతినిధులు తాను చెప్పే విషయాలన్నీ రాయాలని చెప్పి మరీ మోడీ సర్కారు తీరును ఎండగట్టారు కేసీఆర్.

తెలంగాణ సర్కారు నెల వారీ ఆదాయం రూ.15 వేల కోట్ల పైమాటే అని.. అందులో రాష్ట్రం నుంచి సొంతంగా వచ్చే ఆదాయం రూ.11 వేల కోట్ల దాకా ఉంటుందని.. అలాంటిది ఈ నెలలో కేవలం రూ.1600 కోట్ల ఆదాయం వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ఐతే జీతాలకే రూ.3 వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉందని ఇలాంటి సమయంలో కేంద్రం ఆదుకోక తప్పదని కేసీఆర్ అన్నారు. ఐతే కేంద్రం దగ్గర ఇవ్వడానికి డబ్బుల్లేవని.. అలాంటపుడు హెలికాఫ్టర్ మనీ తరహా పాలసీని అమలు చేయాలని తాను సూచించానని.. కానీ కేంద్రం పట్టించుకోలేదని ఆయనన్నారు.

ఈ కష్ట కాలంలో తమ నుంచి రావాల్సిన ఆదాయాన్ని మాత్రం కేంద్రం ముక్కు పిండి వసూలు చేస్తోందని.. అలాగే రుణాల రీషెడ్యూల్ లాంటివి చేయడానికి కూడా అంగీకరించడం లేదని.. ఇలా అయితే రాష్ట్రాలు ఎలా బతకాలని ఆయన ప్రశ్నించారు. ఇక వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లే బాధ్యత కేంద్రం తీసుకోవాల్సి ఉందని.. ఐతే అన్ని ఏర్పాట్లు తాము చేస్తుంటే వారి కోసం ఉచితంగా రైళ్లు కూడా ఏర్పాటు చేయలేకపోవడం దౌర్భాగ్యమని కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. వలస కార్మికులకు రైలు ఛార్జీల కింద రాష్ట్రం తరఫున రూ.4 కోట్ల రూపాయలు రైల్వే శాఖకు కట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం ఇలాంటి సమయంలో ఇలా వ్యవహరించడం తప్పంటూ మరిన్ని అంశాలపై విమర్శలు గుప్పించారు కేసీఆర్.