మాస్క్ వాడమన్నందుకు చంపేశారు

ఇది కరోనా టైం. మాస్క్ వాడకుండా ఎవ్వరూ బయటికి వచ్చే పరిస్థితి లేదు. భారత్ లాంటి దేశాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా జనాలకు అవగాహన వచ్చి మాస్కులు వాడుతున్నారు. అలాంటిది అమెరికా లాంటి దేశంలో మాస్కుల వాడకంపై ఇంకెంత అవగాహన ఉండాలి. అందులోనూ అక్కడ కరోనా వ్యాప్తి, మరణాల రేటు హెచ్చు స్థాయిలో ఉన్న నేపథ్యంలో జనాలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

కానీ ఒక దుకాణంలోకి మాస్క్ లేదన్న కారణంతో తన కూతురిని అనుమతించలేదన్న కోపంతో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపేసిన సంఘటన సంచలనం రేపుతోంది. అమెరికాలోని మిచిగాన్ స్టేట్‌లో ఈ ఘోరం చోటు చేసుకుంది. అమెరికాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మిచిగాన్ ఒకటి. అక్కడి ఫ్లింట్ ప్రాంతంలో షార్మెల్ టీగ్ అనే ఓ మహిళ కూతురితో కలిసి ఓ గ్రాసరీ దుకాణానికి వెళ్లింది.

ఐతే షార్మెల్ కూతురు మాస్క్ తొడుక్కోకపోవడంతో సెక్యూరిటీ గార్డు ఆపాడు. అతడితో షార్మెల్ వాగ్వాదానికి దిగింది. మాటా మాటా పెరిగి ఆమె గన్ను తీసి గార్డు తలకు గురి పెట్టి కాల్చింది. అతను అక్కడిక్కడే కుప్పకూలి మరణించాడు. ఈ ఘోరం చోటు చేసుకున్న సమయంలో షార్మెల్‌తో పాటు ఆమె భర్త, కొడుకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు షార్మెల్‌ను అరెస్టు చేయగా.. ఆమె భర్త, కొడుకు అక్కడి నుంచి పరారయ్యారు.

షార్మెల్ కూతురిపై పోలీసులు ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. మిచిగాన్ రాష్ట్ర వ్యాప్తంగా జనాలు బయటికి వస్తే మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్కుల్లేకుండా ఏ దుకాణంలోకి జనాల్ని అనుమతించట్లేదు. సెక్యూరిటీ గార్డు నిబంధనల మేరకే వ్యవహరించినా.. షార్మెల్ దురుసుగా వ్యవహరించి అతడి ప్రాణాలు బలిగొందని దుకాణ నిర్వాహకులు అంటున్నారు.