ప్రచారంలో పవన్ ఎందుకు కనిపించలేదబ్బా ?

కమలంపార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి మరీ దారుణంగా తయారైపోయినట్లే అనుమానంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేద్దామంటే అందుకు కమలం నేతలు ఒప్పుకోలేదు. ఓట్ల చీలికను అరికట్టాలంటే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రత్యేకంగా భేటి జరిపి పోటీ నుండి జనసేనను విత్ డ్రా చేయించారు.

ఆ సమయంలోనే పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని పవన్ గొప్పగా ప్రకటించారు. అలాగే జనసైనికులతో పాటు తన అభిమానులను బీజేపి విజయానికి పాటుపడాలంటు పిలుపిచ్చారు. సీన్ కట్ చేస్తే పోటీనుండి విత్ డ్రా అవ్వగానే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుండి పిలుపు వచ్చింది. దాంతో అర్జంటుగా నాదెండ్ల మనోహర్ ను తీసుకుని పవన్ ఢిల్లీకి వెళ్ళిపోయారు. అక్కడ మూడు రోజులు ఖాళీగా కూర్చుని చివరకు ఉత్త చేతులతో హైదరాబాద్ కు వచ్చేశారు. ఇక ప్రచారానికి ఉన్నది ఆదివారం ఒక్కరోజే.

హైదరాబాద్ కు వచ్చేసి కూడా మూడు రోజులవుతోంది. అయినా గ్రేటర్ ప్రచారంలో పవన్ ఎక్కడా కనిపించలేదు. అంటే ఇటు పోటీ నుండే కాకుండా అటు ప్రచారానికి కూడా పవన్ను బీజేపీ నేతలు దూరం పెట్టేశారా ? అనే అనుమానం పెరిగిపోతోంది. నిజానికి పవన్ ప్రచారం చేసినంత మాత్రన ఎంతమంది ఓట్లేస్తారనేది డౌటే. పైగా సీమంధ్ర పార్టీ అనే అంశంతో టీఆర్ఎస్ రెచ్చిపోయే అవకాశం ఉందని కూడా కమలంనేతలు అనుమానించారట.

అందుకే కోరి తమంతట తాముగా కేసీయార్ కు అవకాశం ఎందుకివ్వాలన్న ఆలోచనతోనే గ్రేటర్ ప్రచారంలో పవన్ను దూరం పెట్టేసినట్లు బీజేపీ వర్గాల సమాచారం. లేకపోతే తెలంగాణాతో ఏవిధంగాను సంబంధం లేని ప్రకాష్ జవదేకర్, స్మృతీ ఇరానీ, జేపీ నడ్డా, దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేశారు. అమిత్ షా, ఆదిత్యనాద్ లాంటి వాళ్ళతో కూడా ప్రచారానికి రెడీ అయిపోయిన బీజేపీ ఒక్క పవన్ విషయంలోనే వెనకాడుతోందంటే అర్ధమేంటి ?