కలకలం… హెరిటేజ్ సెక్యూరిటీ గార్డ్ కు కరోనా

ప్రపంచ దేశాలను వణికించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా… టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని కంపెనీకి సోకేసింది. హెరిటేజ్ పేరిట పాలు, పాల పదార్థాల తయారీ కంపెనీ చంద్రబాబు ఫ్యామిలీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో యూనిట్లు ఉన్న సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న హెరిటేజ్ యూనిట్ లో మంగళవారం కరోనా కలకలం రేగింది. ఈ యూనిట్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు యువకుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా గాంధీ ఆసుపత్రికి తరించేశారు.

హెరిటేజ్ ప్లాంట్ కు చెందిన ఉద్యోగికి కరోనా పాజిటివ్ అన్న విషయం బయటకు రాగానే… అటు ఉప్పల్ స్థానికులతో పాటు హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే… కరోనా పాజిటివ్ గా తేలిన సెక్యూరిటీ గార్డును ఆసుపత్రికి తరలించిన అధికారులు… ప్లాంట్ లో పనిచేస్తున్న మిగిలిన ఉద్యోగులకు కూడా పరీక్షలు చేయగా.. వారిలో ఓ ఏడుగురు కరోనా అనుమానితులుగా తేలారట. దీంతో వారి చేతులపై హోం క్వారంటైన్ అనే ముద్ర వేసిన అధికారులు వారిని హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారట.

అయితే హోం క్వారంటైన్ కు పంపిన వారిని కూడా విధులకు హాజరు కావాలని హెటిరేజ్ యాజమాన్యం ఒత్తిడి తీసుకువచ్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కరోనా అనుమానితులు విధులకు హాజరైతే మిగిలిన ఉద్యోగుల పరిస్థితి, ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఉప్పల్ వాసులు హెరిటేజ్ ఎదుట ఆందోళనకు దిగారట. దీంతో ఉప్పల్ లోని హెరిటేజ్ ప్లాంట్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా… స్థానికులు శాంతించలేదట. మొత్తంగా కరోనా వేళ… హెరిటేజ్ కంపెనీలోనూ కలకలం రేగిందని చెప్పక తప్పదు.