చంద్రశేఖర్ ఎక్కడినుండి పోటీచేస్తారు ?

కాంగ్రెస్ లో చేరబోతున్న మాజీమంత్రి చంద్రశేఖర్ ఎక్కడి నుండి పోటీచేయబోతున్నారు ? ఇపుడిదే చర్చ కాంగ్రెస్ లో పెరిగిపోతోంది. ఎందుకంటే చంద్రశేఖర్ ది వికారాబాద్ నియోజకవర్గం. అయితే అక్కడ పోటీచేయటానికి అవకాశంలేదు. ఎందుకంటే అక్కడ మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత, బలమైన అభ్యర్ధి గడ్డం ప్రసాదరావు ఉన్నారు. కాబట్టి ప్రసాద్ ను కదల్చటం సాధ్యంకాదు. కాబట్టి వికారాబాద్ లో టికెట్ సాధ్యంకాదని పార్టీ అధిష్టానం ముందుగానే చంద్రశేఖర్ కు చెప్పేసింది. అందుకు బదులుగా చేవెళ్ళ లేదా జహీరాబాద్ టికెట్ ఇస్తామని చెప్పింది.

అధిష్ఠానం సమాచారాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టంగా మాజీమంత్రికి చేరవేశారు. చేవెళ్ళ లేదా జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని అధిష్టానమే నిర్ణయిస్తుందని కూడా చెప్పారు. అందుకు మాజీమంత్రి అంగీకరించారు. ఎక్కువభాగం జహీరాబాద్ నియోజకవర్గమే చంద్రశేఖర్ కు కేటాయించే అవకాశాలున్నాయనే టాక్ వినబడుతోంది. ఈ మాజీమంత్రి బీజేపీలో నుండి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఈనెల 18వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.

నిజానికి చంద్రశేఖర్ వికారాబాద్ నియోజకవర్గంలో బాగా పట్టున్న నేతనే చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశంపార్టీ తరపున 1985 నుండి 2004 ఎన్నికల వరకు ఏకబిగిన ఐదుసార్లు వరుసగా గెలిచారు. తర్వాత రాజకీయం కాస్త గాడితప్పింది. దానికితోడు రాష్ట్ర విభజన కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. అందుకనే అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లో చేరి తర్వాత రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

అయితే అక్కడ చంద్రశేఖర్ సేవలను పార్టీ ఏ విధంగా కూడా వినియోగించుకోలేదు. అందుకనే ఇక లాభంలేదని రాజీనామా చేసేశారు. రెండురోజుల్లో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఒకవిధంగా చంద్రశేఖర్ చేరిక కాంగ్రెస్ పార్టీకి బలమవుతుందనే అనుకుంటున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా చేవెళ్ళే లేదా జహీరాబాద్ నియోజకవర్గాల్లో దేన్ని కేటాయించాలనే విషయమై అధిష్టానమే నిర్ణయిస్తుందని ముందుజాగ్రత్తలు తీసుకుంది. అందుకనే మాజీమంత్రి కూడా అంగీకరించారు. సరే ఏదేమైనా ఎక్కడో ఒకచోట నుండి టికెట్ అయితే ఖాయం. మరి భవిష్యత్తు ఎలాగుంటుందో చూడాల్సిందే.