చిరంజీవికి ‘జీరో’ షేర్ మరక

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘ఆచార్య’నే అతి పెద్ద మిస్టేక్ అని అనుకున్నారు మెగా ఫ్యాన్స్. ఆ సినిమాకు వీకెండ్లో కూడా థియేటర్లు వెలవెలబోగా.. వీక్ డేస్‌లో మరీ తక్కువ వసూళ్లు వచ్చాయి. గత ఏడాది వరకు చూస్తే చిరు కెరీర్లో అదే అతి పెద్ద డిజాస్టర్. ఇలాంటి తప్పు చిరు ఎప్పటికీ చేయడని.. అంతటి దారుణమైన రిజల్ట్ ఇక ఎప్పటికీ రిపీట్ కాదని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ‘భోళా శంకర్’ ఆ అంచనాలను తలకిందులు చేసింది. ‘ఆచార్య’ను మించి ఘోరాతి ఘోరమైన ఫలితాన్ని అందుకుంది.

ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు తక్కువే అయినప్పటికీ.. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్‌‌బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం, పైగా మాస్ టచ్ ఉన్న మూవీ కావడంతో ఓ మోస్తరుగా అయినా ఆడేస్తుందనుకున్నారు. కానీ ప్రేక్షకులతో పాటు చిరు ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని పూర్తిగా తిరస్కరించడం టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.

వీకెండ్లో కూడా సరిగా పెర్ఫామ్ చేయలేకపోయిన ‘భోళా శంకర్’కు సోమవారం మరీ కనీస స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఆ షేర్‌ను లెక్కలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోయింది. మంగళవారం ఇండిపెండెన్స్ డే సెలవు కావడంతో ఒక మాదిరిగా జనం కనిపించారు. కానీ బుధవారం ‘భోళా శంకర్’ పరిస్థితి ఘోరం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆడుతున్న ఏ ఏరియాలోనూ ఈ సినిమాకు షేర్ అంటూ రాలేదు ఆరో రోజు. అంటే వచ్చిన వసూళ్లు థియేటర్ల మెయింటైనెన్స్‌ను దాటి ఒక్క రూపాయి కూడా మిగల్లేదన్నమాట.

అసలు చాలా చోట్ల థియేటర్ల మెయింటైనెన్స్ డబ్బులు కూడా రాలేదు. షో వేస్తే ఎదురు డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. చిరంజీవి నటించిన సినిమాకు ఆరో రోజే జీరో షేర్ రావడం అన్నది ఊహకందని విషయం. ఈ సినిమా థియేట్రికల్ రన్ మంగళవారంతోనే ముగిసిపోయింది. వరల్డ్ వైడ్ రూ.26 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. ‘భోళా శంకర్’ రూ.80 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యేది. అందులో మూడో వంతు కూడా రాలేదంటే ఇదెంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు.