పెద్ద గండం తప్పించుకున్న యానిమల్

హిందీలోనే కాదు ఇటు తెలుగు తమిళంలోనూ సమాన స్థాయి అంచనాలు మోసుకొస్తున్న సినిమా యానిమల్. అర్జున్ రెడ్డి తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దాని బాలీవుడ్ రీమేక్ కబీర్ సింగ్ తప్ప వేరే సబ్జెక్టుని చేయలేదు. ఏళ్ళ తరబడి స్క్రిప్ట్ రాసుకుని ఫైనల్ గా రన్బీర్ కపూర్ తో చేతులు కలిపాడు. షూటింగ్ ఎప్పుడో పూర్తయిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా వాస్తవానికి ముందు అనుకున్న రిలీజ్ డేట్ ఆగస్ట్ 11. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యంతో పాటు ప్రమోషన్లకు తగినంత సమయం లేకపోవడంతో టీమ్ బాగా ఆలోచించి డిసెంబర్ 1కి షిఫ్ట్ చేసుకుని వారాల క్రితమే ప్రకటన ఇచ్చింది.

ఇప్పుడీ నిర్ణయమే యానిమల్ కు వరంగా మారింది. ఎందుకంటే ఒకపక్క రజనీకాంత్ భీభత్సం మాములుగా లేదు. తమిళనాడులోని ఎనభై శాతం థియేటర్లు దీన్ని తప్ప వేరే షోలు వేయడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. బిసి సెంటర్స్ లో ఇలా ఉంది. నగరాలూ పట్టణాల్లో గదర్ 2, ఓ మై గాడ్ 2కు పోను కాసిన్ని భోళా శంకర్ కు ఇచ్చేసి మూడు రోజుల కాగానే వాటినీ లాగేసుకున్నారు. ఒకవేళ యానిమల్ కూడా వచ్చి ఉంటే నార్త్ లో సన్నీ డియోల్, సౌత్ లో రజనీకాంత్ తో తలపడి ఇబ్బందులు ఎదురుకునేది. ఈ రకంగా చూసుకుంటే పెద్ద గండం తప్పినట్టేనని చెప్పాలి.

యానిమల్ కంటెంట్ మీద నిర్మాతలు ధీమాగా ఉన్నారు. పోటీ లేని సీజన్ అయితేనే రికార్డులను తిరగరాసే రేంజ్ లో ఆడియన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు. రష్మీకి మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మాఫియా డ్రామాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ తదితరులు ఇతర కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య వదిలిన ప్రీ టీజర్ జనాన్ని బాగానే ఆకట్టుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో గదర్ 2 ప్రభంజనం చూస్తుంటే మాస్ ఎంతగా కనెక్ట్ అయ్యారో అర్థమవుతోంది. ఇక మనవైపు జైలర్ వన్ సైడ్ బ్యాటింగ్ చూస్తున్నాం. సో మొత్తానికి అంతా మన మంచికే  అనుకుంటున్నారు సందీప్ వంగా బృందం.