బాలుకు చేసినట్లు ఇంకెవరికీ చేయకండి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నిన్న ఉన్నట్లుండి ఆయన ఆరోగ్య పరిస్థితి తారుమారైంది. మొన్నటి వరకు బాలు కోలుకుంటున్నారు.. త్వరలోనే ఆసుపత్రి నుంచి బయటికి వస్తారు అని అప్ డేట్లు వింటూ వచ్చాం. కానీ ఒక్క రోజు వ్యవధిలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆయన పరిస్థితి విషమించింది. లైఫ్ సపోర్ట్ మీద ఉన్న ఆయన మధ్యాహ్నం 1.04 గంటలకు చనిపోయారు. గురువారం రాత్రి వెంటనే ఆసుపత్రికి వెళ్లిన కమల్ హాసన్.. దీన వదనంతో బయటికి వచ్చారు. బాలు బాగున్నారని చెప్పలేనంటూ ఆయన పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పేశారాయన. ఇక అప్పట్నుంచి ఏ క్షణాన దుర్వార్త వినాల్సి వస్తుందో అని బాలు అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి ఆందోళనే నిజమై బాలు తుది శ్వాస విడిచారన్న వార్త మధ్యాహ్నం బయటికి వచ్చింది.

ఐతే బాలు చనిపోవడానికి ముందే ఇటు మీడియా వాళ్లు, అటు సోషల్ మీడియా జనాలు ప్రదర్శించిన అత్యుత్సాహం ఆయన అభిమానుల్ని తీవ్ర వేదనకు గురి చేసింది. నిన్న రాత్రే బాలు చనిపోయినట్లుగా ‘రిప్’ మెసేజ్‌లు తయారైపోయాయి. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్‌ల్లో అప్పుడే అవి హల్‌చల్ చేశాయి. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్.. నిన్న సాయంత్రమే ‘బాలు ఇక లేరా’ అని హెడ్డింగ్ పెట్టి స్టోరీ నడిపింది. ఇక శుక్రవారం మధ్యాహ్నం ప్రముఖ నటుడు నరేష్.. బాలు ఆత్మశాంతించాలని పేర్కొంటూ ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేసేశారు. తర్వాత నెటిజన్లు తిట్టేసరికి.. ఆ ట్వీట్ డెలీట్ చేశారు.

నిజానికి బాలు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ. ఆయన కోలుకోవడం అసాధ్యంగా కనిపించినప్పటికీ.. అధికారికంగా ఆసుపత్రి వర్గాలు కానీ, బాలు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కానీ ఏ ప్రకటనా చేయకముందే ఈ ఆత్రం ఎందుకన్నది అర్థం కాని విషయం. అధికారిక వార్త బయటికి వస్తే.. క్షణాల్లో పాకిపోతుంది. ఇందులో న్యూస్ ఛానెళ్లకైనా, మరొకరికైనా ఎక్స్‌క్లూజివ్ ఏముంటుంది? అందరికంటే ముందు ‘రిప్’ మెసేజ్ పెట్టి సాధించేదేంది? అధికారిక వార్త బయటికొచ్చే వరకు ఆగితే పోయేదేముంది?

ఏదైనా అద్భుతం జరిగి ఆయన కోలుకుంటారో ఏమో అని వేచి చూడొచ్చు కదా? బాలు లాంటి దిగ్గజం విషయంలో.. ఎంతోమంది భావోద్వేగాలతో ముడిపడ్డ వ్యవహారం ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం. కనీసం ఇకముందైనా ఇలాంటి దిగ్గజాల విషయంలో అందరూ కొంచెం సంయమనం పాటిస్తే మంచిది.