అమలకు సమంత కౌంటర్ ఇచ్చిందా?

అక్కినేని వారి కోడలు సమంత.. తన అత్తగారికి కౌంటర్ ఇచ్చినట్లుగా ఓ ప్రచారం సాగుతోంది సోషల్ మీడియాలో. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సమంత మీకు వంట చేసి పెడుతుందా అని అడిగితే.. ఆమెకు వంట రాదని వ్యాఖ్యానించింది అమల.

అయినా తమ ఇంట్లో నాగార్జున అందరి కంటే బాగా వంట చేస్తారని.. అలాంటపుడు ఇంకొకరు ఎందుకు అని ఆమె చమత్కరించింది. అక్కినేని వారింట్లో ఆడవాళ్లు వంటలు చేయరని కూడా అంది. ఐతే అమల సరదాకే అన్నప్పటికీ.. ఈ విషయాన్ని సమంత కొంచెం సీరియస్‌గా తీసుకుని అత్తగారికి సమాధానం చెప్పిందని నెటిజన్లు అంటున్నారు.

తాజాగా సమంత ట్రఫ్ఫెల్ మష్రూమ్ పాస్తా వంటకాన్ని తన చేతులతో వండి.. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనకు వంట వచ్చని చెప్పడానికి.. అమలకు సమాధానం ఇవ్వడానికే ఆమె ఇలా చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు.

దీన్ని బట్టి అమలకు, సమంతకు అభిప్రాయ భేదాలున్నాయంటూ వేరే విషయాలు కూడా కలిపి కొందరు కథనాలు అల్లేస్తున్నారు. ఈ నెల 8వ తారీఖున అఖిల్ పుట్టిన రోజుకు సమంత సోషల్ మీడియాలో విషెస్ చెప్పలేదు.

అలాగే లాక్ డౌన్ టైంలో అక్కినేని వారింట్లో అందరు కుటుంబ సభ్యులు కలిసి సరదాగా గడుపుతుండగా.. సమంత, చైతూ మాత్రం అక్కడికి రావట్లేదని.. అమలతో సమంతకు పడకపోవడమే ఇందుక్కారణమని కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ విషయంలో మరీ లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదనిపిస్తోంది.

సమంత నెల కిందట్నుంచి ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. కరోనా బాధితులకు విరాళం ఇవ్వకపోవడంపై నెటిజన్లు ఆమెను నానా తిట్లు తిడుతుండటంతో సోషల్ మీడియాకు దూరమైందంటున్నారు.

మరోవైపు లేక లేక దొరికిన ఖాళీ టైంలో భర్తతో ఏకాంతంగా గడపాలని ఆమె భావిస్తుండొచ్చు. వంట విషయానికి వస్తే.. ఈ మధ్య కొత్తా గరిట తిప్పడం మొదలుపెట్టి ఏదైనా వంటకం ట్రై చేసి ఉండొచ్చు. కాబట్టి దీనికే అత్తాకోడళ్ల మధ్య గొడవలని అనుకోవడానికేమీ లేదు.