కన్నీళ్లు తెప్పిస్తున్న టాలీవుడ్ నిర్మాత విషాదాంతం

కరోనా బారిన పడి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే అగ్ని ప్రమాదం జరిగి పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఉదంతం విజయవాడలో ఎంతటి విషాదం నింపిందో తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సైతం ఇలాంటి దారుణమే ఒకటి జరిగింది. ఇప్పుడు ఇలాగే కరోనా చికిత్స కోసం వెళ్తుంటే జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోయిన విషాదాంతం ఏపీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి టాలీవుడ్ నిర్మాత కావడం గమనార్హం. ఆయన పేరు.. కమలాకర్ రెడ్డి. ఆయన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’ తెలుగు వెర్షన్‌కు నిర్మాత. ఆయనది నెల్లూరు జిల్లా.

కమలాకర్ తండ్రి కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడ్డారు. ఆయన పరిస్థితి విషమించడంతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చింది. దీంతో అంబులెన్సు మాట్లాడుకుని తండ్రితో కలిసి కమలాకర్‌రెడ్డి కూడా హైదరాబాద్ బయల్దేరాడు. ఐతే మార్గ మధ్యంలో భారీ వర్షం కారణంగా అంబులెన్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో కమలాకర్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి అక్కడిక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. కరోనా నుంచి తండ్రిని కాపాడుకుందామనుకుంటే.. ఇలా ఆయనతో పాటు కమలాకర్ కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదం. లాక్‌డౌన్ ముంగిట విడుదలైన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం మంచి విజయం సాధించింది. లాక్ డౌన్ టైంలో ఆన్ లైన్లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో ఆర్థికంగా మంచి లాభాలే అందుకున్నారు కమలాకర్‌ రెడ్డి.