ఆర్ఆర్ఆర్ నిర్మాత‌కూ క‌రోనా

సెల‌బ్రెటీలెవ‌రైనా క‌రోనా వైర‌స్ బారిన ప‌డితే ఆశ్చ‌ర్య‌పోయే రోజులు పోయాయి. అమితాబ్ బ‌చ్చ‌న్ అంత‌టి వాడే ఈ మ‌హ‌మ్మారి బాధితుడయ్యాడు. మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళిని సైతం వైర‌స్ ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు వైర‌స్ ఎలా సోకింది ఏంట‌నే విష‌యం తెలియ‌దు. ఇప్పుడు రాజ‌మౌళితో ఆర్ఆర్ ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్న సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య సైతం క‌రోనా బాధితుడిగా తేలారు. కొన్ని రోజులుగా ఆయ‌న‌కు జ‌లుబు, జ్వ‌రం ఉన్నాయ‌ట‌. దీంతో ప‌రీక్ష చేయించుకున్నారు. అందులో క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఐతే తీవ్ర ల‌క్ష‌ణాలేమీ లేవ‌ని.. దాన‌య్య ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని అంటున్నారు. ఆయ‌న ఇంటి వ‌ద్దే ఉండి చికిత్సి తీసుకుంటున్నారా.. ఆసుప‌త్రిలో చేరుతున్నారా అన్న‌ది తెలియ‌దు.

ముందు రాజ‌మౌళికి, ఆ త‌ర్వాత దాన‌య్య‌కు క‌రోనా వ‌చ్చిన నేప‌థ్యంలో వీరి మ‌ధ్య ఏమైనా కాంటాక్ట్ ఉండి ఒక‌రి నుంచి ఒక‌రికి క‌రోనా వ‌చ్చిందా అని అనుమానిస్తున్నారు. కొన్ని నెల‌ల పాటు ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన ప‌నులు ఆగిపోగా.. గ‌త నెల‌లో షూటింగ్ పునఃప్రారంభించేందుకు ట్ర‌య‌ల్ షూట్ కోసం స‌న్నాహాలు జ‌రిగాయి. కానీ త‌ర్వాత ప‌రిస్థితులు బాలేవ‌ని వెన‌క్కి త‌గ్గారు. ఇదిలా ఉండ‌గా.. క‌రోనా విష‌యంలో అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేసిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు తేజ సైతం క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్న నేప‌థ్యంలో సామాన్యులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.