2021లో స్క్రీన్‌ అంతా నేనే కనిపిస్తా!!

విభిన్నమైన చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మెంటల్ మదిలో’, ‘నీది నాది ఒకే కథ’ వంటి రొటీన్‌కు భిన్నంగా సాగిన సినిమాలు శ్రీవిష్ణుకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. సక్సెస్‌లు వచ్చినా స్టార్ డమ్ ముసుగులో మునిగిపోకుండా, కేవలం కథాబలం ఉన్న కాన్సెప్ట్‌లనే ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది ‘బ్రోచేవారెవరురా’ సినిమాతో హిట్టు కొట్టిన శ్రీవిష్ణు, వచ్చే ఏడాది చివరిదాకా ఫుల్లు బిజీగా ఉండబోతున్నాడట.

సినిమాల్లో నటించాలనే కసి, కోరిక కారణంగానే హీరో కావడానికి ముందు 12 ఏళ్లు జూనియర్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కష్టపడ్డానని చెప్పిన శ్రీవిష్ణు… తన సుదీర్ఘ కెరీర్ సంతృప్తికరంగానే సాగుతోందని అన్నాడు. ప్రస్తుతం ‘రాజ రాజ చోళ’ అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శ్రీవిష్ణు.

ఒక్క వ్యక్తి ద్వారా మొదలైన పుకార్లు, సమాజంలోని మనుషుల బుర్రలను ఎలా తొణిచేస్తాయనే డిఫరెంట్ కథాంశంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్ట్‌లను ఫైనల్ చేసిన శ్రీవిష్ణు… లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వాటిని కూడా ప్రారంభించబోతున్నాడట. ఇప్పుడున్న ఖాళీ టైమ్‌ను ఏ మాత్రం వేస్ట్ చేయకుండా తన దగ్గరున్న యంగ్ దర్శకుల స్క్రిప్ట్స్ అన్నీ చదివేస్తున్న ఈ కుర్రాడు… వాటిల్లో నచ్చిన కథలను ఎంచుకుని, లైన్‌గా సినిమాలు చేస్తూ పోతాడట.

స్టార్ హీరోలు ఒక్క సినిమా ఒకే చేయడానికి మూడేసి నెలల సమయం తీసుకుంటుంటే… మూడు నెలల్లో కనీసం ఓ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నాడు శ్రీవిష్ణు. ఈ ఏడాది ఇప్పటికే సగం పూర్తయింది కాబట్టే వచ్చే ఏడాది పూర్తిగా స్క్రీన్‌ మీద తానే కనిపిస్తామని ఎంతో ధీమాగా చెబుతున్నాడు శ్రీవిష్ణు. కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శ్రీవిష్ణు స్నేహితుడు నారా రోహిత్ కూడా త్వరలో మళ్లీ ట్రాక్ ఎక్కబోతున్నాడట. ఇద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్టు ప్రకటించాడు శ్రీవిష్ణు.