చైతూ, సమంత అభిమానుల గొడవ

అక్కినేని నాగచైతన్య, సమంతలకు విడి విడిగా ఉన్న అభిమానుల కంటే వీళ్లద్దరినీ కలిపి అభిమానించే వారు ఎక్కువమంది ఉండేవారు ఒకప్పుడు. ఈ జంట ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నపుడు అందరికీ చూడముచ్చటగా అనిపించింది. టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్‌ ట్యాగ్ లైన్ వీరిదే అన్నట్లుండేది అప్పట్లో. ఇద్దరూ ఎప్పుడు కలిసి కనిపించినా చూడ్డానికి చాలా బాగుండేది.

ఈ జంట ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని అందరూ కోరుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరగడం చాలామందికి నచ్చలేదు. ఇద్దరూ విడిపోతున్నట్లుగా వార్తలు వస్తే తట్టుకోలేకపోయారు. విడాకుల వార్తలు నిజం కాకూడదని కోరుకున్నారు. చివరికి అలా జరగలేదు. చైతూ, సమంత నిజంగానే విడిపోయారు. ఇక అప్పట్నుంచి మ్యూచువల్ ఫ్యాన్స్ విచ్ఛిన్నం అయిపోయారు. చైతూ, సమంతలకు వేర్వేరుగా అభిమానులు తయారయ్యారు. ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి.

విడాకుల విషయంలో చైతూను తప్పుబట్టే వాళ్లు కొందరైతే.. సమంతను నిందించేవాళ్లు ఇంకొందరు. ఈ రెండు వర్గాలు వీళ్లిద్దరి సినిమాల రిలీజ్ టైంలో కూడా కలహించుకుంటున్నారు. పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ట్రోల్ చేస్తున్నారు. ‘శాకుంతలం’ రిలీజైనపుడు సమంత విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తోందని ఆమెను టార్గెట్ చేయడమే కాక.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం చవిచూడటంపై విపరీతంగా ట్రోల్ చేసింది ఒక బ్యాచ్. అప్పుడు సైలెంటుగా ఉన్న సమంత అభిమానులు.. ఇప్పుడు చైతూ సినిమా వచ్చేసరికి రంగంలోకి దిగారు.

ఈ సినిమా రిలీజ్ రోజు ఆ వర్గం ఆల్రెడీ ఉన్న నెగెటివిటీని ఇంకా పెంచడానికి ప్రయత్నించింది. ‘కస్టడీ’ డే-1 వసూళ్ల మీద ఈ బ్యాచ్ విపరీతంగా ట్రోల్ చేస్తోంది. డిజాస్టర్ అయినప్పటికీ సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శాకుంతలం’కి తొలి రోజు వచ్చిన వసూళ్ల కంటే చైతూ మూవీ ‘కస్టడీ’కి డే-1 వసూళ్లు తక్కువ అంటూ ఇప్పుడు ఈ బ్యాచ్ ఎద్దేవా చేస్తోంది. చైతూ, సమంత మూవ్ ఆన్ అయిపోయి ఎవరి జీవితాల్లో వాళ్లు పడిపోయినా ఈ అభిమానులు మాత్రం ఇంకా ఇలాగే గొడవపడుతూ ఉండటం విడ్డూరం.