ప్రభుత్వాల ఆటలో కేరళ స్టోరీ బలి

కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో తీవ్ర చర్చలకు దారి తీసిన ది కేరళ స్టోరీ మీద కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు విపరీతమైన ఆందోళనకు దారి తీస్తోంది. తమిళనాడు దీన్ని ముందే నిషేదించగా పశ్చిమ బెంగాల్ బ్యాన్ చేయడమే కాక గతంలో వచ్చిన కాంట్రావర్సి మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ ని ఉదహరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం నిప్పుని ఇంకా రగిలించింది. కేరళ మల్టీప్లెక్సులు మొదటి రోజు నుంచే ప్రదర్శనలు ఆపేయగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా షోలు జరిగిపోతున్నాయి. ఇక్కడే ఇబ్బంది లేదు

బిజెపి అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లు ఏకంగా పన్ను మినహాయింపులిచ్చాయి. ఎల్లుండి యుపి సిఎం యోగి ఆదిత్య నాధ్ ప్రత్యేకంగా ప్రీమియర్ చూడబోతున్నారు. ఇలా ఈ సినిమాకు రాజకీయ రంగు పులుముకోవడంతో అన్ని పార్టీలు దీన్నో ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నాయి. అయితే ఇలా గవర్నమెంట్లే స్వయంగా నిషేధాలకు పిలుపునివ్వడం పట్ల ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ వచ్చినవాటిని ఇలా అడ్డుకోవడం చట్టరిత్యా ఆమోదయోగ్యం కాదని ఒక నోట్ విడుదల చేశాయి

రోజుకో పరిణామంతో ది కేరళ స్టోరీ తెరమీదతో పాటు బయట అంతకన్నా సెన్సేషన్లు చేస్తోంది. 15న సుప్రీమ్ కోర్టులో కేరళ సర్కారు మీద దాఖలైన కేసుని విచారణ చేపట్టబోతున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా ఆడుతున్న చోట్ల మాత్రం ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ది కేరళ స్టోరీ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జనాలు బాగా చూస్తున్నారు. దీని ప్రభావం కన్నడ హిందీలో రిలీజైన విరూపాక్ష డబ్బింగ్ వెర్షన్ మీద పడింది. వీకెండ్స్ లో కొత్త రిలీజులు దేనికీ హౌస్ ఫుల్స్ లేకపోయినా ఒక కేరళ స్టోరీ మాత్రమే సోల్డ్ అవుట్ బోర్డులు పెట్టేసుకుంది