ఆ ట్రిప్ త‌ర్వాత సుశాంత్ మారిపోయాడు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్న‌ద స్థితిలో మృతి చెంద‌డం వెనుక అత‌డి ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తి ప్ర‌మేయంపై అనుమానాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గ‌త కొన్ని నెల‌ల్లో సుశాంత్ అకౌంట్ నుంచి రూ.3 కోట్ల దాకా రియా సొంత అవ‌స‌రాల‌కు వాడుకున్న‌ట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే రియా వ‌ల్ల సుశాంత్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని.. ఆమె అత‌ణ్ని మార్చేసింద‌ని అంటూ ఆమె తీరు ప‌ట్ల మ‌రిన్ని అనుమానాలు పెంచాడు సుశాంత్ ద‌గ్గ‌ర 2017-19 మ‌ధ్య అసిస్టెంట్‌గా ప‌ని చేసిన అంకిత్ ఆచార్య‌.

ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంకిత్ మాట్లాడుతూ.. సుశాంత్‌ను రెండేళ్ల‌కు పైగా అత‌డి నీడ‌లా ఉండి చూసుకున్నాన‌ని.. అలాంటిది ఉన్న‌ట్లుండి త‌న‌తో స‌హా సుశాంత్ వ్య‌క్తిగ‌త సిబ్బంది అంద‌రినీ గ‌త ఏడాది రియా మార్చేసింద‌ని అంకిత్ తెలిపాడు. తాను ఊరెళ్లి వ‌చ్చేస‌రికి 2019 ఆగ‌స్టులో ఈ మార్పు చోటు చేసుకుంద‌ని అత‌ను వెల్ల‌డించాడు. సుశాంత్ దగ్గర కొత్తగా పనిచేస్తున్న బాడీగార్డ్స్ తనను ఇంట్లోకి కూడా అనుమతించలేదని అంకిత్ తెలిపాడు. ఇంట్లో పూజా వ్య‌వ‌హారాల‌న్నీ రియానే చూసుకుంటోంద‌ని వాళ్లు చెప్పారని.. కానీ ఇంట్లో విగ్ర‌హాలు లేకుండా నిమ్మ‌కాయ‌లు, పూలు పెట్టి ఆమె పూజ‌లు చేసేద‌ని అత‌న‌న్నాడు.

2019 సెప్టెంబర్‌లో సుశాంత్‌ను క‌లిశాన‌ని.. త‌న‌కు ఇవ్వాల్సిన రెండు నెల‌ల జీతంతో పాటు అద‌నంగా రూ.50 వేలు ఇచ్చాడ‌ని.. అయితే అంత‌కుముందే రియాతో క‌లిసి సుశాంత్ యూర‌ప్ ట్రిప్‌కు వెళ్లి వ‌చ్చాడ‌ని.. ఆ ప‌ర్య‌ట‌న త‌ర్వాత అత‌డి ముఖంలో కాంతి పోయింద‌ని.. క‌ళ్ల కింద వ‌ల‌యాలు వ‌చ్చాయ‌ని.. ముఖంలో నవ్వు లేదని, తీవ్ర మానసిక వేదన కనిపించిందని అంకిత్ చెప్పాడు. గ‌త ఏడాది జ‌న‌వ‌రి నాటికి సుశాంత్ అకౌంట్‌లో రూ.30 కోట్లు ఉన్నాయని, రియా సుశాంత్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేదని అంకిత్ చెప్పాడు. సుశాంత్ డిప్రెష‌న్ మందులు వాడేవాడ‌న్న వార్త‌ల‌పై అంకిత్ స్పందిస్తూ.. తాను అత‌డితో ఉన్న‌పుడైతే ఎలాంటి మందులు వాడే వాడు కాదని స్పష్టం చేశాడు.