ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ అట.. అదా ఇదా?

బాలు, కంత్రి, శక్తి, కథానాయకుడు లాంటి వరుస డిజాస్టర్లతో ఒక దశలో టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితికి వచ్చింది వైజయంతీ మూవీస్ సంస్థ. అశ్వినీదత్ వల్ల కానిది తాము చేద్దామనుకుని ఆయన కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్‌లు కొత్తగా స్వప్న సినిమా బేనర్ పెట్టి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తీస్తే అవీ వర్కవుట్ కాలేదు. అలాంటి దశలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న సినిమాతో మళ్లీ దత్ ఫ్యామిలీ నిలబడింది. అక్కడి నుంచి వరుస హిట్లు డెలివర్ చేస్తోంది. ముఖ్యంగా ‘మహానటి’ సినిమాతో దత్ పూర్వ వైభవాన్ని అందుకున్నారనే చెప్పాలి. ఇప్పుడాయన ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో తన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మెగా ప్రాజెక్టు చేయబోతున్నాడు.

దీంతో పాటే స్వప్న సినిమా బేనర్లో చిన్న, మీడియం రేంజ్ సినిమాల నిర్మాణమూ కొనసాగనుంది. ఈ బేనర్లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల వార్తలొచ్చాయి. ‘అందాల రాక్షసి’ లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’తో సత్తా చాటి.. ఆపై లై, ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో దారుణమైన ఫలితాలందుకున్న హను రాఘవపైడికి దత్ కూతుళ్లు ఛాన్సివ్వబోతున్నట్లు వార్తలొచ్చాయి. దుల్కర్ సల్మాన్ ఇందులో హీరో అన్నారు. అలాగే ‘ఓ బేబీ’తో ఫాంలోకి వచ్చిన నందిని రెడ్డి సైతం ఈ బేనర్ కోసం ఓ కథ రెడీ చేస్తోంది కొంత కాలంగా. ఈ రెండింట్లో ఏదో ఒకటి మంగళవారం అనౌన్స్ కాబోతోంది. తమ బేనర్లో తెరకెక్కబోయే కొత్త సినిమా గురించి ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ రాబోతోందని స్వప్న సినిమా బేనర్ ట్విట్టర్ పేజీలో ప్రకటించారు. మరి ఆ ప్రకటన హను-దుల్కర్ సినిమా గురించా.. లేక నందిని రెడ్డి మూవీ గురించా అన్నది చూడాలి.